
బాసర గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం
బాసర: బాసర మండలం సాలపూర్ సమీపంలోని గోదావరి నదిలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. పూర్తిగా కుళ్లిపోయి గుర్తించలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆచూకీ తెలిసిన వారు బాసర పోలీసులను సంప్రదించాలని కోరారు.
నవజాత శిశువు మృతి
భీంపూర్: మండలంలోని భగవాన్పూర్లో నవజాత శిశువు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రియాంకకు సోమవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. రోడ్డుమార్గం సరిగా లేకపోవడంతో అంబులెన్స్ రావడంలో ఆలస్యమైంది. దీంతో మహిళ ఇంటివద్దే ప్రసవించగా శిశువు మృతి చెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డుమార్గాన్ని బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పాముకాటుతో మహిళ..
వాంకిడి: పొలం పనులకు వెళ్లిన ఓ మహిళను పాము కాటువేయడంతో మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన వడ్గురే జానాబాయి(34), శంకర్ దంపతులు ఆదివారం పంటచేనుకు వెళ్లారు. సాయంత్రం పనులు చేస్తుండగా జానాబాయిని పాముకాటు వేసింది. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఆటో బోల్తాపడి డ్రైవర్..
కుభీర్: ఆటో బోల్తాపడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల మేరకు మండలంలోని లింగి గ్రామానికి చెందిన కె.గంగాధర్ (33) సోమవారం సాయంత్రం ఆటోలో సిమెంటు బస్తాలు వేసుకుని భైంసా నుంచి వస్తుండగా సాంవ్లి గ్రామం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

బాసర గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం