ఇక బహిరంగ ప్రదేశాల్లో మూత్రం పోశారో.. | West Bengal imposes Rs 200 for public urination | Sakshi
Sakshi News home page

ఇక బహిరంగ ప్రదేశాల్లో మూత్రం పోశారో..

Sep 1 2026 7:18 PM | Updated on Sep 1 2026 7:29 PM

West Bengal imposes Rs 200 for public urination

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో రహదారులపై ఉమ్మివేయడం, బహిరంగ ప్రదేశాల్లో, మూత్రం పోయడం, చెత్త వేయడం వంటి చర్యలకు మంగళవారం నుంచి జరిమానాలు విధించడం ప్రారంభించారు. రాష్ట్రంలోని నగరాల్లో పరిశుభ్రతను పెంచే చర్యల్లో భాగంగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ జరిమానాల ఉద్దేశం ఆదాయం సమకూర్చుకోవడం కాదని, ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమేనని పట్టణాభివృద్ధి, పురపాలక వ్యవహారాల మంత్రి అగ్నిమిత్ర పాల్ తెలిపారు.

బహిరంగ ప్రదేశంలో ఉమ్మితే రూ.100 జరిమానా విధిస్తారు. చెత్తను పడేయడం లేదా అపరిశుభ్రతకు కారణమయ్యేలా చేయడంపై రూ.200 జరిమానా ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన, మూత్ర విసర్జన చేసినా రూ.200 చెల్లించాలి. 125 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకానికీ ఇదే జరిమానా వర్తిస్తుంది. అయితే జరిమానాలను కఠినంగా అమలు చేసేందుకు అవసరమైన పౌర మౌలిక వసతులు ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని ప్రభుత్వం తెలిపింది.

“జరిమానాల ద్వారా డబ్బు వసూలు చేయడానికి కఠినంగా వ్యవహరించడం మా ఉద్దేశం కాదు. ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం. జరిమానాలు విధించి ప్రజల నుంచి డబ్బు తీసుకోవాలని మేము కోరుకోవడం లేదు” అని పాల్ చెప్పారు. కోల్‌కతాతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు కూడా అందంగా మారాలని తాము కోరుకుంటున్నామని ఆమె అన్నారు.

నగరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రభుత్వం ఒక్కటితో సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల్లో బాధ్యతాభావం రావాలని, “ఈ నగరం కూడా తమదే” అనే భావన పెరగాలని ఆమె అన్నారు. ఏడాదిలో కొన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే సరిపోదని, ప్రజలు తమ నగరం, తమ రాష్ట్రాన్ని తామే అపరిశుభ్రం చేయకూడదనే భావనను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో మార్పు కనిపిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ప్రజా మౌలిక వసతులపై దృష్టి 
ప్రజా మౌలిక వసతులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మార్కెట్లు, రైల్వే స్టేషన్ల సమీపంలో చెత్తబుట్టలను ఏర్పాటు చేస్తున్నారు. అదనపు ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు ప్రారంభించారు. “ఈ రోజు నుంచి జరిమానాలు ప్రారంభమవుతున్నాయి. అదే సమయంలో చెత్తబుట్టలు ఏర్పాటు చేయడం, మరుగుదొడ్లు నిర్మించడం కూడా కొనసాగుతోంది” అని పాల్ తెలిపారు.

ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు ప్రత్యామ్నాయాలను అందించేందుకు మార్కెట్లలో యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఒకటి ఒక్కోటి రూ.1కు మొక్కజొన్న ఆధారిత సంచులను, మరొకటి రూ.5 నుంచి రూ.10 ధరకు గుడ్డ సంచులను అందిస్తుంది. ఇళ్ల మధ్య చెత్తబుట్టలు ఏర్పాటు చేయకుండా, కుటుంబాలు చెత్తను రెండు రకాలుగా వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని ప్రభుత్వం సూచిస్తోంది.

2019లో సవరించిన పురపాలక చట్టం ప్రకారం బహిరంగంగా ఉమ్మివేస్తే గరిష్ఠంగా రూ.1,000 వరకు జరిమానా విధించే నిబంధన ఇప్పటికే ఉంది. కోల్‌కతాలో అక్రమంగా చెత్త వేయడంపై రూ.50 నుంచి రూ.5,000 వరకు జరిమానాలు ఉన్నాయి. అయితే ఈ నిబంధనల అమలు గతంలో సవాలుగా మారింది. ప్రస్తుతం ప్రారంభమైన కొత్త చర్యలు ఎంత సమర్థంగా అమలవుతాయన్నది రానున్న రోజుల్లో కీలకంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement