సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ పరిణామం చోటు చేసుకుంది. రేపు జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారంపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన కార్యాలయం లోక్భవన్ ప్రకారం, విజయ్కు ప్రస్తుతం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని, మెజారిటీకి కావాల్సిన 118 సంఖ్య ఇంకా చేరలేదని స్పష్టం చేశారు. వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు లేఖలు ఇంకా అందలేదని గవర్నర్ కార్యాలయం పేర్కొంది.
అయితే, విజయ్ శుక్రవారం మూడోసారి గవర్నర్ను కలుసుకుని టీవీకే, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల మద్దతుతో మొత్తం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని తెలిపారు. సంబంధిత లేఖలను గవర్నర్కు అందజేశారు. గవర్నర్ కూడా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అనంతరం విజయ్ తనకు మద్దతు తెలిపిన వామపక్ష నేతలతో సమావేశమై కృతజ్ఞతలు తెలిపారు.
సీపీఐ, సీపీఎం ఇప్పటికే బేషరతుగా మద్దతు ప్రకటించాయి. ఈ రెండు పార్టీలకు నాలుగు సీట్లు ఉన్నాయి. ఐయూఎంఎల్ రెండు సీట్లు గెలుచుకున్నప్పటికీ, వారు నేరుగా విజయ్కు మద్దతు ప్రకటించకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఐదు సీట్లతో ఇప్పటికే విజయ్కు మద్దతు ప్రకటించింది. విజయ్ పార్టీ టీవీకే 108 సీట్లు గెలుచుకున్నప్పటికీ, ఆయన రెండు చోట్ల నుంచి గెలవడంతో అసలు సంఖ్య 107కి తగ్గింది. దీంతో మెజారిటీ మార్క్ 118కి 11 సీట్లు దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో వామపక్షాలు, కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు కీలకంగా మారింది.
రెండు సీట్లు గెలిచిన వీసీకే పార్టీ.. డిప్యూటీ సీఎం పదవి కావాలని పట్టుబడుతోంది. అయితే, ఇప్పటికే వీసీకే పార్టీకి తాము పట్టణాభివృద్ధి శాఖ, తిరుచ్చి అసెంబ్లీ నియోజవకర్గం సీటు ఇస్తామని హామీ ఇచ్చింది. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. ఊహించని విధంగా తమకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే మద్దతు పలుకుతామని, లేదంటే విరమించుకుంటామని పట్టుబట్టింది. అందకే గవర్నర్కు లేఖ అందించలేదు. అదే సమయంలో డీఎంకే అధినేత స్టాలిన్తో విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ అధినేత, ప్రముఖ దళిత నాయకుడు తోల్. తిరుమాళవన్ భేటీ అయ్యారు.


