బెంగాల్‌ చేరుకున్న రూబియో.. పర్యటన భారత్‌కు కీలకం | US Marco Rubio arrived in Kolkata | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ చేరుకున్న రూబియో.. పర్యటన భారత్‌కు కీలకం

May 23 2026 7:38 AM | Updated on May 23 2026 7:38 AM

US Marco Rubio arrived in Kolkata

న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నాలుగు రోజుల పర్యటన కోసం భారత్‌కు చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఆయన కోల్‌కత్తాలో ల్యాండ్‌ అయ్యారు. బాధ్యతలు చేపట్టాక ఆయన భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. భారత్‌–పాక్‌ మధ్య అణు యుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్‌ పదేపదే ప్రకటించుకోవడం, భారీ టారిఫ్‌లు, హెచ్‌1బీ వీసాల కట్టడి చర్యలు తదితరాల కారణంగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి గాడిన పెట్టడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేపట్టారు.

విదేశాంగ మంత్రి జై శంకర్‌తో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై అనేక అంశాలపై చర్చలు జరుపుతారు. మంగళవారం ఢిల్లీలో జరిగే క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో పాల్గొంటారు. రూబియో పర్యటన సందర్భంగా కోల్‌కతా, జైపూర్, ఆగ్రాలను కూడా సందర్శించే అవకాశముందని సమాచారం. ప్రధాని మోదీని కూడా ఆయన కలుసుకుంటారు. ‘భారత్‌తో మాకు చాలా పనుంది. భారత్‌ మాకు మంచి మిత్ర దేశం, భాగస్వామి కూడా. నాది చాలా ముఖ్యమైన ట్రిప్‌’అంటూ భారత్‌ పర్యటనపై శుక్రవారం రూబియో వ్యాఖ్యానించడం గమనార్హం. పశ్చిమాసియాలో పరిణామాలు, ఇంధన సరఫరాలపై ప్రభావంతోపాటు వాణిజ్యం, పెట్టుబడులు, క్రిటికల్‌ టెక్నాలజీ, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాలపై చర్చలు జరిగే అవకాశముందని చెబుతున్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement