టీఎంసీకి ఝలక్‌.. అభిషేక్‌ బెనర్జీనే కారణమా? | TMC Debalina Biswas quits chairperson post notice to Abhishek Banerjee | Sakshi
Sakshi News home page

టీఎంసీకి ఝలక్‌.. అభిషేక్‌ బెనర్జీనే కారణమా?

May 21 2026 7:30 AM | Updated on May 21 2026 7:31 AM

TMC Debalina Biswas quits chairperson post notice to Abhishek Banerjee

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయిన తర్వాత తృణముల్‌ కాంగ్రెస్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్ దేబాలినా బిస్వాస్ కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఆమె రాజీనామా లేఖ వెలుగులోకి రావడంతో టీఎంసీకి భారీ షాక్‌ తగిలింది. అయితే, టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ కారణంగానే ఆమె తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.

టీఎంసీ నియంత్రణలో ఉన్న కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ), అభిషేక్ బెనర్జీకి సంబంధించిన 17 ఆస్తులకు నోటీసులు జారీ చేసిన మరుసటి రోజు ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ సందర్బంగా దేబాలినా బిస్వాస్ మాట్లాడుతూ..‘నేను నా పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాలా రాయ్‌కి లేఖ పంపాను. కౌన్సిలర్‌గా కొనసాగుతూ, నా ప్రాంత ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఈ పదవిలో చాలా కాలంగా ఉన్నాను, కానీ ఇప్పుడు తప్పుకుంటున్నాను. నేను ఇది పూర్తిగా పార్టీ సంబంధిత కారణాల వల్ల చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.  

అయితే, అభిషేక్ బెనర్జీ నివాసం.. అక్రమ నిర్మాణంగా జరిగిందంటూ కేఎంసీ (KMC) నోటీసులు జారీ చేసిన తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మరియు పార్టీ అగ్ర నాయకత్వం తనపై ఒత్తిడి తెచ్చారని బిస్వాస్ ఆరోపించారు. ఈ క్రమంలో..‘నిన్న నోటీసు ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు. అకస్మాత్తుగా, అర్ధరాత్రి వేళ ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. ‘లేదు, ఇది సరికాదు’ అని నాకు అనిపించింది. తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వమని ఒకరిని బలవంతం చేయడం లేదా వారి ఇష్టానికి వ్యతిరేకంగా పనులు చేయమని ఒత్తిడి చేయడం పార్టీకి తగదని నేను భావిస్తున్నాను. విషయాన్ని కప్పిపుచ్చడం సరైన పద్ధతి కాదు. మనం అడగాలి. ఇది ఎందుకు జరిగింది? ఇది ఎలా జరిగింది? దీనికి ఎవరు బాధ్యులు?. కొన్ని విషయాలు నా పరిధిలోకి రావు’ అని వ్యాఖ్యానించారు.

అభిషేక్ బెనర్జీ కంపెనీ, కుటుంబానికి సంబంధించి కేఎంసీ నోటీసులు అందుకున్న 17 చిరునామాలలో, 14 చిరునామాలు బిస్వాస్ అధ్యక్షత వహించిన బరో 9 పరిధిలోకి వస్తాయి. నోటీసులు జారీ చేసిన తర్వాత సోమవారం రాత్రి నుంచే పార్టీ నాయకుల నుంచి ఫోన్లు రావడం ప్రారంభమయ్యాయని ఆమె చెప్పారు. పార్టీ అగ్ర నాయకత్వంలోని ఒక వర్గం ఆదేశాల మేరకు బిస్వాస్ రాజీనామా చేశారని టీఎంసీ నాయకుల్లో ఒక వర్గం ఆరోపిస్తోంది. ​కాగా, తన రాజీనామా ఇంకా అధికారికంగా ఆమోదించబడలేదని బిస్వాస్ తెలిపారు. మరోవైపు.. నగరంలో అభిషేక్ బెనర్జీకి అనేక అక్రమ ఆస్తులు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. 

Advertisement
 
Advertisement
Advertisement