ఆర్డినెన్స్ తీసుకొచ్చిన కేంద్రప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 38కు చేరుకోనుంది. సుప్రీంకోర్టు చట్టం–1956ను సవరిస్తూ ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ను కేంద్ర ప్రభుత్వం శనివారం జారీ చేసింది. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుపుకుని మొత్తం జడ్జీల సంఖ్య గతంలో 34 ఉండగా ఇకపై 38కి పెరగనుంది.
కోర్టుల్లో ఏళ్లుగా పేరుకుపోతున్న కేసుల భారాన్ని తగ్గించి సామాన్యులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతోనే ప్రభుత్వం జడ్జీల పెంపు నిర్ణయం తీసుకుందని న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆదివారం ‘ఎక్స్’లో చెప్పారు. తాజా ఆర్డినెన్స్కు సంబంధించిన బిల్లును రానున్న వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది.
ఇందుకు సంబంధించిన బిల్లు ముసాయిదాను ఈ నెల 5వ తేదీన కేంద్ర కేబినెట్ ఆమోదించిందని ఆయన వివరించారు. సుప్రీం జడ్జీల సంఖ్యను పెంచేందుకు వీలు కల్పించే తొలి చట్టం 1956లో రూపుదిద్దుకుంది. అప్పట్నుంచి అవసరాలకు అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. చివరిగా 2019లో జడ్జీల సంఖ్యను 30 నుంచి 34కు పెంచారు.


