ఢిల్లీ: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులు, రోడ్లు, ఎక్స్ప్రెస్ వేలపై పైకి వీధి కుక్కలు, పశువులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు దీనిని తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపింది.
ఈ ఆదేశాల అమలుపై ఎనిమిది వారాల్లో స్టేటస్ రిపోర్టు అందజేయాలని సుప్రీంకోర్టు కోరింది. పాఠశాలలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆస్పత్రులలోకి వీధి కుక్కలు రాకుండా ఎనిమిది వారాల్లోగా తగిన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రెండు వారాల్లోగా మున్సిపల్ సిబ్బంది వీధికుక్కలు ఉండే స్థలాలను, భవనాలను గుర్తించాలని, ఈ ప్రాంతాల్లో తిరిగే వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసి, రీ లొకేషన్ చేయాలని కోరింది.
వీధి కుక్కలను వాటిని పట్టుకున్న ప్రాంతాలలో తిరిగి వదిలిపెట్టకూడదని, ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బంది వీధి కుక్కలు తిరిగే ప్రాంతాలలో తనిఖీ చేయాలని సుప్రీం కోర్టు తెలిపింది. పబ్లిక్ ఏరియాలలో వీధి కుక్కలు తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను అమలు చేయాలని ఆదేశించింది. ఈ నివేదిక అమలుపైన అఫిడవిట్ దాఖలు చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది.


