భోపాల్: మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఒక వివాహిత తన ఇష్టానుసారం ప్రియుడితో వెళ్లవచ్చని పేర్కొంది. తన భర్తను విడిచి ప్రియుడితో వెళ్లాలని 19 ఏళ్ల యువతి దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు ఈ విషయమై ఆ మహిళకు ప్రియుడితో వెళ్లడానికి అనుమతినిస్తూ తీర్పు ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే.. అనూజ్ కుమార్ అనే వ్యక్తి తన భార్యను అపహరించాడని ఆరోపిస్తూ యువతి భర్త అవదేష్ హెచియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు వారిద్దరిని పట్టుకొని కోర్టు ఎదుట హాజరుపరిచారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయమూర్తి సదరు మహిళను ఎవరితో ఉండాలనుకుంటున్నావు అని ప్రశ్నించారు.
దీనికి సదరు మహిళ సమాధానం ఇస్తూ" నా భర్త వయస్సు 40 సంవత్సరాలు, నావయస్సు 19 సంవత్సరాలు మా ఇద్దరి మధ్య 19 ఏళ్ల తేడా ఉంది. నా వైవాహిక జీవితం సరిగ్గా లేదు. నా భర్త సరిగ్గా ప్రవర్తించడం లేదు". అని కోర్టుకు తెలిపింది. అనంతరం ఆ మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ ఆమె తన ప్రియుడితో వెళ్లడానికే అంగీకరించింది. దీంతో కోర్టు ఆమె అభ్యర్థనను అంగీకరించింది.


