
ప్రపంచ సగటు కంటే రెండు రెట్లు అధికం
ప్రపంచ వాతావరణ సంస్థ పరిశోధనలు వెల్లడి
పర్యావరణంపై ఓ కొత్త నివేదిక ఆసియాను ఆందోళన పరుస్తోంది. తీవ్రమైన వాతావరణ మార్పులు ఆసియాను సంక్షోభానికి గురి చేస్తాయని హెచ్చరిస్తోంది. వాతావరణ మార్పులపై ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవల ‘స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ఆసియా–2024’ను విడుదల చేసింది. ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకంటే ఆసియా రెండు రెట్లు వేగంగా వేడెక్కుతోందని అధ్యయనం పేర్కొంది. ఈ మార్పు అత్యంత తీవ్రమైన పర్యావరణ సమస్యలను కలిగిస్తుందని హెచ్చరించింది. మంచి నీటి వనరులతో పాటు, తీర ప్రాంతాలకు ముప్పు అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
వేగంగా కరుగుతున్న హిమనీనదాలు
ఆసియాలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో 2024లో ఒకటిగా నమోదైందని నివేదిక తెలిపింది. 1991–2020 బేస్లైన్ కంటే సగటు ఉష్ణోగ్రతలు 1.04 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉన్నాయని పేర్కొంది. ఖండం ప్రపంచ సగటు కంటే దాదాపు రెండు రెట్లు వేగంగా వేడెక్కుతోందని నివేదిక తెలిపింది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా మధ్య ఆసియాలోని హిమాలయాలు, టియాన్ షాన్ వంటి కీలక పర్వత శ్రేణుల్లో హిమానీనదాలు కరగడం వేగవంతం అయ్యింది. దీనివల్ల కీలకమైన మంచినీటి వనరులు, పర్యావరణ వ్యవస్థలకు ప్రమాదం ఉందని వివరించింది.
తీరప్రాంతాలకు ముప్పు..
ఆసియాలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయని ‘స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ఆసియా–2024’నివేదిక తెలిపింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన కారణంగా, ఆసి యా పసిఫిక్, హిందూ మహాసముద్ర తీరప్రాంతా ల్లో సముద్ర మట్టాలు ప్రపంచ సగటు కంటే వేగంగా పెరిగాయి. ఈ ధోరణులు భారత్తో సహా ఖండంలోని తీరప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది ప్రజలకు ప్రమాదమని పేర్కొంది. ఇవి వరదలు, తుఫానుల ప్రమాదాలను పెంచుతాయని వెల్లడించింది. 2024 ఆసియా ఖండం అంతటా తీవ్ర విపత్తులు సంభవించిన విషయం తెలిసిందే.
తీవ్రమైన వేడి..
ఆసియాలోని కొన్ని ప్రాంతాలను, ముఖ్యంగా భారత్, జపాన్లను సుదీర్ఘమైన వేడి గాలులు తాకాయని తెలిపింది. ఇవి వందలాది మంది మరణాలకు కారణమయ్యాయని నివేదిక పేర్కొంది. సముద్ర ఉష్ణ గాలులు రికార్డు స్థాయిలో 15 మిలియన్ చదరపు కిలోమీటర్లకు చేరుకున్నాయని, ఇది సముద్ర జీవవైవిధ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని హెచ్చరించింది. ఈ సంవత్సరంలో ఉష్ణమండల తుఫాను యాగి ఆగ్నేయాసియా అంతటా విస్తృతమైన నష్టాన్ని కలిగించింది. ఇది గత సెపె్టంబర్లో ఉత్తర వియత్నాంలో డజన్ల కొద్దీ ప్రజల ప్రాణాలను బలిగొంది. అలాగే, మధ్య ఆసియా 70 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత దారుణమైన వరదలను చవి చూసింది. ఎన్నడూ లేనంత వర్షపాతంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మౌలిక సదుపాయాలకు తీవ్ర అంతరాయం కలిగింది. సెపె్టంబర్ 2024లో నేపాల్ కూడా విపరీతమైన వరదలొచ్చాయి. 246 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు సకాలంలో పనిచేయడం, పరిపాలనా వ్యవస్థలు సమన్వయంతో ప్రతిస్పందించడంతో వేలాది మంది ప్రాణాలను కాపాడగలిగారు.
తక్షణ లక్ష్యాలు..
ఈ విపత్కర పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి తక్షణ వ్యూహాలు అత్యవసరమని నివేదిక సూచించింది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి దేశాలన్నీ ఉమ్మడి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని పేర్కొంది. పర్యావరణ మార్పుల వల్ల కలిగే మానవ, ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి ముందస్తు చర్యలు చాలా అవసరమని, ప్రజల జీవితాలను, వారి జీవనోపాధిని రక్షించడానికి విపత్తు సంసిద్ధతను మెరుగుపరచాలని సూచించింది. ఇక రాబోయే ముప్పును గుర్తించడంలో జాతీయ వాతావరణ సేవలు కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని గుర్తు చేసింది.
– సాక్షి, నేషనల్ డెస్క్