
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న భారతీయ రైల్వే తన ఉద్యోగులకు, వారి కుటుంబాలకు గణనీయమైన బీమా ప్రయోజనాలను అందించేందుకు ముందుకొచ్చింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరింది.
ఎస్బీఐలో జీతం ఖాతాలు కలిగిన రైల్వే ఉద్యోగులు ఇకపై ఒక కోటి రూపాయల మేరకు ప్రమాద మరణ బీమా కవరేజీని పొందనున్నారు. ఎస్బీఐ శాలరీ ఖాతాలు కలిగిన రైల్వే ఉద్యోగులు ఇకపై రూ. 10 లక్షల సహజ మరణ బీమాకు అర్హులు అవుతారు. ఎటువంటి ప్రీమియం చెల్లింపులు లేదా వైద్య పరీక్షలు లేకుండా ఈ బీమా రైల్వే ఉద్యోగులకు వర్తిస్తుంది. రైల్వేలో దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులకు జీతాలు ఎస్బీఐ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి.
ఈ అవగాహనా ఒప్పందం పలు బీమా రక్షణలను కూడా అందిస్తుంది. వీటిలో రూ. 1.60 కోట్ల విమాన ప్రమాద మరణ కవరేజీ మొదలైనవి ఉన్నాయి. ఈ ఒప్పందం ముఖ్యంగా గ్రూప్ సిలోని ఫ్రంట్లైన్ సిబ్బందికి, తరచూ వృత్తిపరమైన ప్రమాదాలను ఎదుర్కొనే వారికి ప్రయోజనం చేకూర్చేలా రూపొందించినదని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రైల్వేలకు వెన్నెముకగా ఉన్న శ్రామిక శక్తికి మద్దతు ఇచ్చేందుకే ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.