న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ తనను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తప్పించడంపై ఎంపీ రాఘవ్ చద్దా శుక్రవారం స్పందించారు. తాను చేసిన నేరం ఏంటని సూటిగా ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడమే తాను చేసిన తప్పా అంటూ నిలదీశారు. ఈ మేరకు ఎక్స్లో శుక్రవారం వీడియో పోస్ట్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తాను పార్లమెంట్లో మాట్లాడుతున్నానని, తనను ఆపాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆవేదన వ్యక్తం చేశారు.
"పార్లమెంటులో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా నేను ప్రజల సమస్యలను లేవనెత్తాను. అలా చేయడం నేరమా లేక తప్పా? నన్ను పార్లమెంటులో మాట్లాడకుండా చేయమని రాజ్యసభ సెక్రటేరియట్కు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారికంగా సమాచారం ఇచ్చినందువల్లే నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. నన్ను ఎవరైనా ఎందుకు మౌనంగా ఉంచాలనుకుంటారు? నా మౌనాన్ని నా ఓటమిగా పొరపాటు పడకండి" అని రాఘవ్ చద్దా అన్నారు.
రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించినంత మాత్రాన పార్లమెంట్లో తన గళం మూగబోదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై గళం విన్పిస్తూనే ఉంటానని అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. కాగా, రాఘవ్ చద్దా వ్యవహారంపై ఆమ్ ఆమ్ ఆద్మీ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.
చదవండి: ఎంపీ రాఘవ్ చద్దాకు షాక్ ఇచ్చిన సొంత పార్టీ
విమానాశ్రయాల్లో అధిక ఆహార ఛార్జీలు, గిగ్ వర్కర్ల సమస్యలు, ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్లు, డేటా ప్లాన్లతో ప్రైవేటు టెలికం కంపెనీల మాయాజాలం, మినిమమ్ చార్జీల పేరుతో బ్యాంకుల బాదుడు, నగరాల్లో ట్రాఫిక్ సమస్య, టోల్ ఫీజుల రుద్దుడు, మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్నుల్లో అసంబద్ధత, పితృత్వ సెలవుకు చట్టబద్ధత వంటి అంశాలను రాజ్యసభలో ప్రస్తావించారు. ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
Silenced, not defeated
My message to the ‘aam aadmi’
—
खामोश करवाया गया हूँ, हारा नहीं हूँ
'आम आदमी’ को मेरे संदेश pic.twitter.com/poUwxsu0S3— Raghav Chadha (@raghav_chadha) April 3, 2026


