కశ్మీర్‌లో ఉగ్ర దాడి.. పోలీసు వీరమరణం

Police officer killed, CRPF jawan injured in Pulwama terror attack - Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఆదివారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో పోలీసు అధికారి ఒకరు నేలకొరగగా, సీఆర్‌పీఎఫ్‌ జవాను గాయపడ్డారు. ఈ ఘటన పుల్వామా జిల్లా పింగ్లానా ప్రాంతంలో తనిఖీల సమయంలో చోటుచేసుకుంది. వీరమరణం పొందిన పోలీసును స్పెషల్‌ పోలీస్‌ విభాగానికి చెందిన జావిద్‌ అహ్మద్‌ దార్‌గా గుర్తించారు. క్షతగాత్రుడైన జవానును ఆస్పత్రికి తరలించారు.

ఘటన నేపథ్యంలో అదనపు బలగాలను రంగంలోకి దించి, పారిపోయిన ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఉగ్రదాడిని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, రాజకీయ పార్టీలు ఖండించాయి. మరోఘటన.. షోపియాన్‌ జిల్లా బస్కచాన్‌ ప్రాంతంలో చేపట్టిన కార్డన్‌ సెర్చ్‌ బృందంపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన షోపియాన్‌ జిల్లా నౌపొరా వాసి అహ్మద్‌ భట్‌ హతమయ్యాడు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top