న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి కీలక సమావేశం గురువారం సుమారు నాలుగున్నర గంటల పాటు కొనసాగింది. దేశ అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, “వికసిత్ భారత్” లక్ష్యాల సాధనపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
సమావేశంలో కేంద్ర వాణిజ్య, ఆర్థిక శాఖలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా దేశ ఆర్థిక పరిస్థితి, పెట్టుబడులు, ఎగుమతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను వివరిస్తూ నివేదికలు సమర్పించాయి. ప్రభుత్వ పనితీరు మరింత వేగవంతం కావాలని, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు మరియు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రధాని మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.
క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర హోదా మంత్రులు, సహాయ మంత్రులు సమావేశానికి హాజరై తమ శాఖల పనితీరు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై వివరాలు అందించారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతి, ప్రజలకు సేవల అందుబాటు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ ఆసియా సంక్షోభం (West Asia Crisis) మరియు దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందనే అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. చమురు ధరలు, దిగుమతులు, వాణిజ్యంపై వచ్చే ప్రభావాలను అధికారులు మంత్రివర్గానికి వివరించినట్లు తెలుస్తోంది.
ఇక వచ్చే జూన్ 9 నాటికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో, ఇప్పటివరకు అమలు చేసిన పథకాలు, భవిష్యత్ లక్ష్యాలపై కూడా సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.


