
న్యూఢిల్లీ: వికసిత భారత నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయడంలో ప్రభుత్వాన్నికున్న నిబద్ధతను రోజ్గార్ మేళా ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన శనివారం ఢిల్లీలో జరిగిన 16వ ఎడిషన్ రోజ్గార్ మేళా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజాగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా చేరిన 51 వేలకు పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు.
కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ ‘మీరు నూతన ప్రయాణం సాగిస్తున్న తరుణంలో మిమ్మల్ని అభినందిస్తున్నాను. భారతదేశానికి రెండు శక్తులు ఉన్నాయని ప్రపంచం భావిస్తోంది. అవి ఇక్కడి జనాభా, ప్రజాస్వామ్యం. నేను ఇటీవలే ఐదు దేశాల పర్యటన నుండి తిరిగి వచ్చాను. ఈ సందర్భంగా ఇతర దేశాలతో మనం చేసుకున్న ఒప్పందాలు ఖచ్చితంగా మన యువతకు ప్రయోజనం చేకూరుస్తాయి’ అని ప్రధాని పేర్కొన్నారు.
యువత ఉపాధి కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం రోజ్గార్ మేళా నిర్వహిస్తోంది. యువతకు సాధికారత కల్పించడం, దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడం కోసం దీనిని చేపట్టింది. రోజ్గార్ మేళా ప్రచారం ప్రారంభించినప్పటి నుండి, దేశవ్యాప్తంగా 10 లక్షలకుపైగా నియామక ఉత్తర్వులు అందించారు. 16వ ఎడిషన్ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో జరిగింది. రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పోస్టల్ శాఖ, ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలతో సహా వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో నియామకాలు జరుగుతున్నాయి.
The Rozgar Mela reflects our Government’s commitment to empowering the Yuva Shakti and making them catalysts in building a Viksit Bharat. https://t.co/2k3WDTVnJc
— Narendra Modi (@narendramodi) July 12, 2025
ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో యువత సాధికారత విషయంలో ప్రభుత్వనిబద్ధతను పునరుద్ఘాటించారు. ‘అభివృద్ధి చెందిన, స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడంలో యువ స్నేహితుల భాగస్వామ్యాన్ని పెంచాలని నిశ్చయించుకున్నాం. దీనిలో భాగంగా జూలై 12న ఉదయం 11 గంటలకు, వేలాది మంది యువతకు నియామక పత్రాలు అందజేస్తాం. ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొంటున్నాను’ అని ఆ పోస్టులో తెలిపారు.