10, 12వ తరగతుల ఆఫ్లైన్ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ
నేడు విచారించనున్న సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర బోర్డులు నిర్వహించనున్న 10, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించి అంతర్గత మూల్యాంకనం చేపట్టాలా, భౌతికంగా పరీక్షలు నిర్వహించాలా అనే అంశంపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ‘కరోనా కేసులు తగ్గినప్పటికీ గడిచిన రెండేళ్లుగా సమస్య తొలగలేదు. ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించడం లేదు.
పరీక్షలు భౌతికంగా నిర్వహించడానికి బదులు ప్రత్యామ్నాయ మార్గం చూడాలి’ అని న్యాయవాది ప్రశాంత్ పద్మనాభన్ కోరారు. ‘బుధవారం విచారణ ప్రారంభిస్తాం’ అని జస్టిస్ ఖన్వీల్కర్ సూచించారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్రాల బోర్డులు 10, 12వ తరగతుల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. టర్మ్–2 పరీక్షలను ఏప్రిల్ 26 నుంచి నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది.
తమ విద్యార్థుల మార్కులను అంతర్గత మూల్యాంకన విధానం ద్వారా నిర్ణయించుకునేందుకు గత ఏడాది సుప్రీంకోర్టు కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్సీఈ), సీబీఎస్ఈలకు అనుమతినిచ్చింది. ఇదే విధానం ఈసారీ అమలుకానుందో లేదో సుప్రీంకోర్టు విచారణలో తేలనుంది.