తిరువనంతపురం: కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు దెబ్బమీద దెబ్బ పడుతుంది. ఇదివరకే అధికారం కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆయనకు ఇప్పుడు ఆ రాష్ట్ర ట్రాఫిక్ నిబంధనలు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. ఆయన సీఎంగా వినియోగించిన కారుపై గత రెండేళ్లుగా 18 ఫైన్ చలాన్లు పడ్డాయని ఆ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాటి జరిమానాలు సైతం ఇదివరకూ చెల్లించలేదని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన కేరళం ఎన్నికల్లో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఈ కూటమికి కేవలం 35 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో పదేళ్లపాటు సీఎంగా ఉన్న పినరయి విజయన్ సీఎంకు పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని నివేదికలు తెలిపాయి. గత రెండేళ్లుగా ఆయన కారు 18 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు గురైందని రూ.13,750 జరిమానాలు విధించబడ్డాయని పేర్కొన్నాయి.
అందులో అధికంగా సీట్బెల్ట్ లేకుండా ప్రయాణించడం వల్ల 12 సార్లు జరిమానాలు పడ్డాయని పేర్కొన్నారు. జనవరి 2025లో కోవలం- కరోడే జాతీయ రహదారిపై గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించారని దానికి కూడా జరిమానా విధించబడిందని తెలిపారు. అదే విధంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వీ గోవిందన్ ప్రయాణించిన కేఎల్ 7 ఆర్ గల కారుపై సైతం 18 చలాన్లు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు నివేదికలు అందించారు.
తాజాగా ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చిత్రాలను విడుదల చేశారు. అయితే పినరయి విజయన్ రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ట్రాఫిక్ నిబంధనలు అత్యంత పకడ్బందీగా అమలు చేసేందుకు ఆ రాష్ట్రంలో ఏఐ కెమెరాలు అమర్చారు. ఇప్పుడు ఆ కెమెరాలలోని మాజీ సీఎం కారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన చిత్రాలు ఉండడం విశేషం.


