సాక్షి, చెన్నై: 15 ఏళ్ల ప్రభుత్వ బంగ్లా జ్ఞాపకాలకు గుడ్బై చెప్పి రాయపేటలో కొత్త ఇంట్లోకి మాజీ సీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పడి పళనిస్వామి శుక్రవారం గృహప్రవేశం చేశారు. చెన్నై గ్రీన్వేస్ రోడ్డులోని తన అధికారిక ప్రభుత్వ బంగ్లా సెవ్వంతిని ఖాళీ చేశారు. 2011లో జయలలిత మంత్రివర్గంలో రహదారుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరుసగా 15 ఏళ్ల పాటు ఆయన ఈ బంగ్లాలోనే నివసించారు.
ఈ కాలంలోనే ఆయన ముఖ్యమంత్రిగా (2017–2021), ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా (2021–2026) వ్యవహరించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడు రాజకీయ చిత్రం మారిపోయింది. అన్నాడీఎంకే ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేకపోవడంతో పళనిస్వామి ప్రతిపక్ష నాయకుడి హోదాను కోల్పోయారు. ప్రస్తుతం కేవలం ఒక శాసనసభ్యుడిగా మాత్రమే ఉన్నందున, నిబంధనల ప్రకారం ఆయన ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు ఆయన రాయపేటలోని దైవశికామణి వీధిలో కొత్తగా నిర్మించిన రెండు అంతస్తుల ప్రైవేట్ బంగ్లాలోకి మారారు. రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి అత్యంత సమీపంలోకి ఆయన మకాం మారడం గమనార్హం. ప్రభుత్వ నివాసంలో ఉండే ఆంక్షలు ఇకపై ఉండవు కాబట్టి, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేందుకు ఈ ప్రైవేట్ బంగ్లా ఆయనకు ఒక రాజకీయ పవర్హౌస్గా మారే అవకాశం ఉంది.


