శబరిమల యాత్ర నేపథ్యంలో పరమపవిత్రంగా భావించే పంపా నది కాలుష్య కూపంగా మారడంపై కేరళ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నదిలో బట్టలు, ఇతర వ్యర్థాలు పడేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని పేర్కొంటూ.. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
శబరిమల యాత్రకు వచ్చే భక్తులు సంప్రదాయాల పేరుతో పాత బట్టలు, తువాళ్లు పంపా నదిలో వదిలిపెడుతుండడం, అలాగే చెత్తను పారబోస్తుండడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. దీనివల్ల నది కాలుష్యం పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత సమస్య తీవ్రరూపం దాల్చింది. ఈ దృశ్యాలు బయటకు రావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా హైకోర్టు స్వయంగా (సుమోటోగా) ఈ అంశాన్ని విచారణ చేపట్టింది.
ఈ నేపథ్యంలో కేసును విచారించిన హైకోర్టు.. అధికారులపై గత విచారణల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో యంత్రాంగం కదిలి క్లీన్ డ్రైవ్ చేపట్టింది. ఇప్పటికే నదిలో పేరుకుపోయిన బట్టలు, వ్యర్థాల్లో 97 శాతం వరకు తొలగించినట్లు కోర్టుకు శుక్రవారం నివేదించారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. పరిస్థితి మెరుగుపడిందని పేర్కొంటూ సుమోటో పిటిషన్ను ముగించింది.

అయితే భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డుతో పాటు పాటు స్థానిక సంస్థలు, పోలీసులు, సంబంధిత అధికారులు కలిసి పనిచేసి పంపా నదిలో బట్టలు, ఇతర వ్యర్థాలు పారబోయకుండా నిరోధించాలని ఆదేశించింది.
అలాగే శబరిమల యాత్రికుల్లో అవగాహన పెంచాలని, నది పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిదని కోర్టు వ్యాఖ్యానించింది. నదీ తీరాల్లో పర్యవేక్షణ పెంచడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది.



