పంపా నదిలో ఇక ‘నో డంపింగ్’! | No Dumping In Sabarimala pampa River Kerala HC Strict Orders News | Sakshi
Sakshi News home page

పంపా నదిలో ఇక ‘నో డంపింగ్’!

May 29 2026 12:52 PM | Updated on May 29 2026 12:58 PM

No Dumping In Sabarimala pampa River Kerala HC Strict Orders News

శబరిమల యాత్ర నేపథ్యంలో పరమపవిత్రంగా భావించే పంపా నది కాలుష్య కూపంగా మారడంపై కేరళ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నదిలో బట్టలు, ఇతర వ్యర్థాలు పడేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని పేర్కొంటూ.. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్‌ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

శబరిమల యాత్రకు వచ్చే భక్తులు సంప్రదాయాల పేరుతో పాత బట్టలు, తువాళ్లు పంపా నదిలో వదిలిపెడుతుండడం, అలాగే చెత్తను పారబోస్తుండడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. దీనివల్ల నది కాలుష్యం పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత సమస్య తీవ్రరూపం దాల్చింది. ఈ దృశ్యాలు బయటకు రావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో మీడియా కథనాలు, సోషల్‌ మీడియా పోస్టుల ఆధారంగా హైకోర్టు స్వయంగా (సుమోటోగా) ఈ అంశాన్ని విచారణ చేపట్టింది. 

ఈ నేపథ్యంలో కేసును విచారించిన హైకోర్టు.. అధికారులపై గత విచారణల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో యంత్రాంగం కదిలి క్లీన్‌ డ్రైవ్‌ చేపట్టింది. ఇప్పటికే నదిలో పేరుకుపోయిన బట్టలు, వ్యర్థాల్లో 97 శాతం వరకు తొలగించినట్లు కోర్టుకు శుక్రవారం నివేదించారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. పరిస్థితి మెరుగుపడిందని పేర్కొంటూ సుమోటో పిటిషన్‌ను ముగించింది.

అయితే భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ట్రావెన్‌కోర్‌ దేవస్వోమ్‌ బోర్డుతో పాటు పాటు స్థానిక సంస్థలు, పోలీసులు, సంబంధిత అధికారులు కలిసి పనిచేసి పంపా నదిలో బట్టలు, ఇతర వ్యర్థాలు పారబోయకుండా నిరోధించాలని ఆదేశించింది.

అలాగే శబరిమల యాత్రికుల్లో అవగాహన పెంచాలని, నది పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిదని కోర్టు వ్యాఖ్యానించింది. నదీ తీరాల్లో పర్యవేక్షణ పెంచడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది.

కేరళలోని అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన నదుల్లో పంపా నది ఒకటి. ఈ నది పశ్చిమ కనుమలలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న పులచిమల కొండల ప్రాంతంలో పుట్టి.. పథనంతిట్ట, అలప్పుజా గుండా సుమారు 175 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. చివరకు వెంబనాడ్ సరస్సులో కలిసే ఈ నది, అక్కడి నుంచి అరేబియా సముద్రాన్ని చేరుతుంది.

శబరిమల అయ్యప్ప స్వామి యాత్రలో పంపా నదికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. అయ్యప్ప భక్తులు ఆలయ దర్శనానికి ముందు ఈ నదిలో పవిత్ర స్నానం చేసి, పాప విమోచనం కలుగుతుందని విశ్వసిస్తారు. అందుకే పంపాను “దక్షిణ గంగ” అని కూడా పిలుస్తారు. అంతేకాదు.. కేరళలో తాగునీరు, సాగు, మత్స్యకార రంగాలకు కూడా ఈ నది కీలక ఆధారంగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో యాత్రికుల రద్దీ, వ్యర్థాల పారవేత, కాలుష్యం కారణంగా పంపా నది పరిశుభ్రతపై పర్యావరణవేత్తల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement