Nationwide COVID-19 Mock Drill From Today To Check Covid Preparedness - Sakshi
Sakshi News home page

Covid-19 Mock Drill: కోవిడ్‌ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్‌.. అప్రమత్తంగా ఉండాల్సిందే!

Apr 10 2023 8:36 AM | Updated on Apr 10 2023 9:30 AM

Nationwide Covid 19 Mock Drill From Today To Check Covid Preparedness - Sakshi

కేంద్ర ఆరోగ్య మంత్రి గతవారమే దీనిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందులో భాగంగానే..

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండంటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గతవారం దీనిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవియా సూచించారు. ఇందులో భాగంగానే అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులలో సౌకర్యాలపై ఈ రోజు (సోమవారం), రేపు (మంగళవారం) దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే హర్యానాలోని ఝజ్జర్‌ ఎయిమ్స్‌లో మాండవియా మాక్‌డ్రిల్‌ను పర్యవేక్షించనున్నట్లు సమాచారం.

ఈ మేరకు మాండవియా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇటీవల కరోనా కేసులు గణనీయంగా పెరుతున్నాయని అన్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా ఎదుర్కొనేలా సంసిద్ధంగా ఉందని నొక్కి చెప్పారు. అంతేగాదు ఆస్పత్రిలో సంరక్షణ ఏర్పాట్లు, సంసిద్ధతపై వారానికోసారి సమీక్ష జరుగుతుందని కూడా తెలిపారు. అలాగే పెరుగుతున్న ఈ కేసుల దృష్ట్యా కరోనా నాలుగో వేవ్‌పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. చివరి కోవిడ్‌ మ్యూటేషన్‌ ఓమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఎఫ్‌.7, ఇప్పుడు వస్తున్న మరో వేరియంట్‌ ఎక్స్‌బీబీ 1.16 వంటి కారణంగానే కేసులు పెరుగుతున్నాయన్నారు.

ఐతే ఈ ఉప వేరియంట్‌లు అంత ప్రమాదకరమైనవి కాదని చెప్పారు. కొత్త వేరియంట్లతో సంబంధం లేకుండా 'టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌-వ్యాక్సినేట్‌' అనే కోవిడ్‌ నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించిన ఫైవ్‌ ఫోల్డ్‌ స్ట్రాటజీ సిద్దంగా ఉందని చెప్పారు. కాగా, గత కొన్ని రోజులుగా దేశంలో చాలా ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నందున అనేక రాష్ట్రాల్లో మళ్లీ మాస్కులు తప్పనిసరి చేయడమేగాక మరికొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది కేంద్రం.

ముందుజాగ్రత్తగా హర్యానా, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలుబహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. అలాగే హర్యానలోని పాఠశాలల్లో కూడా మాస్క్‌లు తప్పనిసరి చేయడమే గాక ఉత్తరప్రదేశ్‌లో 'అధిక ప్రాధాన్యత' పేరుతో విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులను స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించేలా అధికారులను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం.
(చదవండి: మహారాష్ట్ర ఆలయంలో విషాదం..చెట్టుకూలి ఏడుగురు మృతి)

Advertisement
 
Advertisement
Advertisement