మధ్యప్రదేశ్లోని భోపాల్లోట్విషా శర్మ మరణానికి సంబంధించిన కేసులో ఒక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి తరువాత వధువును అత్తవారింటికి పంపే అప్పగింతల కార్యక్రమం సందర్భంగా, ఆమె అత్త, తన కోడలి వరకట్నం మరణం కేసులో నిందితురాలిగా ఉన్న విశ్రాంత జిల్లా న్యాయమూర్తి గిరిబాల సింగ్ రూ. 2 లక్షల వరకట్నం డిమాండ్ చేసిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ట్విషా శర్మ వరకట్న మరణం కేసును విచారిస్తున్న సీబీఐ ఈ విషయాన్ని ఎఫ్ఐఆర్ (FIR)లో పేర్కొంది. ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త (రిటైర్డ్ జడ్జి) గిరిబాల సింగ్లపై సీబీఐ కొత్తగా కేసునమోదు చేసి, భోపాల్ పోలీసుల నుండి ఆధారాలను స్వాధీనం చేసుకుంది.
గత ఏడాది డిసెంబర్ 9న మోడల్, నటి ట్విషా శర్మకు , న్యాయవాది సమర్థ్ సింగ్తో వివాహం జరిగింది. కట్నం భారీగానే చెల్లించారు. అయితే పెళ్లి ముగిసి అత్తగారింటికి పంపించే సమయం (విదాయి)లో సమర్థ్ సింగ్ తల్లి గిరిబాల సింగ్ రూ. 2 లక్షలు డిమాండ్ చేశారని, ఒత్తిడి తట్టుకోలేక వధువు కుటుంబం ఆ డబ్బు చెల్లించిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అదీ చాలదన్నట్టు పెళ్లయిన కొద్దిరోజుల నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్తగారు కలిసి ట్విషాను శారీరకంగా, మానసికంగా వేధించారని వధువు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మొదట జరిగిన రూ. 2 లక్షల డిమాండ్ తదుపరి తీవ్ర వేధింపులకు దారితీసిందా? అసలు ఆమె మరణానికి గల కారణాలేంటి? అనే కోణంలో సీబీఐ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది.
కాగా పెళ్లైన ఐదు నెలలకే అత్తగారింట్లో ట్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. వరకట్న వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు కేసు నమోదు చేసింది. అలాగే పోస్ట్మార్టంలో అవకవతవకలు జరిగాయంటూ కోర్టును ఆశ్రయించింది. దీంతో మధ్య ప్రదేశ్ హైకోర్టు రీ పోస్ట్మార్టంకు ఆదేశించింది.
అంతకు ముందే భోపాల్ పోలీసుల నుంచి ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు. రంగంలోకి దిగిన సీబీఐ ప్రత్యేక బృందం భోపాల్ చేరుకుని ఆధారాలను సేకరించడం, నిందితులను విచారించడం ప్రారంభించింది. భార్య మరణం తరువాత పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సమర్థ సింగ్ పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. సెక్షన్లు 80(2), 85, 3(5) లతో పాటు, వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4 కింద భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్లపై సీబీఐ కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ట్విషా కుటుంబం చేస్తున్న ఆరోపణలను భర్త సమర్థ్ సింగ్ కుటుంబం పూర్తిగా నిరాకరిస్తోంది. తాము ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, ట్విషాకు డ్రగ్స్ అలవాటు ఉండేదని, దానివల్లే ఆమె ఇబ్బంది పడేదని గిరి బాల సింగ్ వెల్లడించారు. ఈమె వ్యాఖ్యలపై ఇంటర్నెట్లో దుమారంరేగింది. విక్లిమ్ను బ్లేమ్ చేస్తూమొసలి కన్నీళ్లు కారుస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వరకట్నం కోరలకు కన్న కూతురిని బలి చేయడం కంటే, విడాకులు తీసుకొని పుట్టింట్లో ఆమెను బతనివ్వడమే మేలని హితవు పలకడం గమనార్హం.


