గ్రామ సచివాలయాలు భేష్‌ | Ministry Of Jalshakti Praises Andhra Pradesh Village Secretariats | Sakshi
Sakshi News home page

గ్రామ సచివాలయాలు భేష్‌

Nov 10 2021 4:22 AM | Updated on Nov 10 2021 3:48 PM

Ministry Of Jalshakti Praises Andhra Pradesh Village Secretariats - Sakshi

గ్రామ సచివాలయాల పనితీరును కేంద్ర జలశక్తి శాఖ కీర్తించింది. వీటి సేవలు ప్రశంసిస్తూ జలజీవన్‌ సంవాద్‌ అక్టోబరు సంచిక ఈ–బుక్‌లో కథనాన్ని ప్రచురించింది.

సాక్షి, న్యూఢిల్లీ: పాలనను ప్రజల అందుబాటులోకి తీసుకురావాలన్న సత్‌ సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చీ రాగానే ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయాల పనితీరును కేంద్ర జలశక్తి శాఖ కీర్తించింది. వీటి సేవలు ప్రశంసిస్తూ జలజీవన్‌ సంవాద్‌ అక్టోబరు సంచిక ఈ–బుక్‌లో కథనాన్ని ప్రచురించింది. జల్‌జీవన్‌ మిషన్‌ లక్ష్యాలు చేరుకునేలా గ్రామ సచివాలయాలు పనిచేస్తున్నాయని కితాబిచ్చింది. అక్టోబరులో ఆరుగురు సభ్యుల బృందం రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించి సచివాలయ వ్యవస్థను అధ్యయనం చేసింది. అనంతరం ఈ–బుక్‌లో దీనిపై ఓ వ్యాసం ప్రచురించింది. 

ప్రధానాంశాలు ఏమిటంటే.. 
2 వేలు, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటుచేయాలని 2019లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ సచివాలయం ముఖ్యోద్దేశం ఏమిటంటే.. గ్రామ పంచాయితీ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు అన్ని ప్రభుత్వ సేవలను గ్రామస్తులకు వారి ఇంటి వద్దే అందుబాటులో ఉండేలా చూడటం. వారికి 318 సౌకర్యాలు కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేసింది. పరిపాలన మీ ఇంటి వద్దే అనే 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తిని అనుసరించి ఏపీ ప్రభుత్వం ఇలా ప్రత్యేకమైన ప్రయోగం చేపట్టింది.

ఇందులో భాగంగా.. ప్రజలకు మెరుగైన సేవలను వారి ఇంటి వద్దే అందించడానికి గ్రామ సచివాలయం కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి, ఏఎన్‌ఎం/మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (మహిళలు) విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్, విలేజ్‌ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ అసిస్టె¯Œంట్, విలేజ్‌ టెక్నికల్‌ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ డిజిటల్‌ అసిస్టెంట్, విలేజ్‌ సర్వేయర్, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్, యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్లను నియమించింది. ఈ ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ కూడా రూపొందించింది. ఇది గ్రామస్థాయిలో భారీ ఉద్యోగ కల్పనకు శ్రీకారం చుట్టింది. 

ప్రతీ 50 కుటుంబాలకు ఓ వలంటీర్‌
ప్రతీ 50 కుటుంబాలకు ఒకరు చొప్పున భారీస్థాయిలో వలంటీర్లను చేర్చుకుంది. వీరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆయా కుటుంబాలకు అందేలా సహకరిస్తారు. ఏపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద గ్రామస్తులకు ఏటా రూ.50వేల నుంచి రూ.60వేల వరకూ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకాల ఫలితాలు గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచినీటిని దీర్ఘకాలం పాటు అందించడం అనే ‘జల్‌జీవన్‌ మిషన్‌’ లక్ష్యానికి అనుగుణంగా ఈ గ్రామ సచివాలయాలు పనిచేస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement