బండెనుక బండికట్టి రేపిస‍్టు పోతుంటే.. కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్‌ | Memes against dera baba gurmeet Ram Rahim Singh | Sakshi
Sakshi News home page

బండెనుక బండికట్టి రేపిస‍్టు పోతుంటే.. కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్‌

May 26 2026 8:45 PM | Updated on May 26 2026 9:28 PM

Memes against dera baba gurmeet Ram Rahim Singh

అత్యాచార దోషి, డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు 30 రోజుల పెరోల్ మంజూరయ్యాక అతడు హరియాణాలోని రోహ్‌టక్‌లోని సునారియా జైలు నుంచి విడుదలై సిర్సాకు చేరుకున్నాడు. దాదాపు పది కార్లు అతడి ముందు, వెనక ఉండగా దర్జాగా మధ్యలోని కారులో కూర్చొని సిర్సాకు వెళ్లాడు. అత్యాచార దోషి ఇలా ఓ రాజులా విహారానికి వచ్చినట్లు కనపడడంతో తీవ్ర విమర్శలతో పాటు సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి.

అత్యాచార దోషికి పెరోల్‌ మంజూరుకు కావడంతో దీనిపై సీనియర్‌ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఎక్స్‌లో స్పందిస్తూ.. “గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి పెరోల్ మంజూరైంది.. ఈ సారి 30 రోజులు దక్కింది. 2017 ఆగస్టులో శిక్ష పడినప్పటి నుంచి ఇది 16వసారి అతను పెరోల్‌పై బయటకు వచ్చాడు. అత్యాచార కేసులో అతడు 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదే సమయంలో ఉమర్ ఖాలిద్ లాంటి వారు విచారణ కూడా మొదలు కాకుండా దాదాపు 6 ఏళ్లుగా జైలులో ఉన్నారు. ఇదే న్యాయ వ్యవస్థ. ఇకపై మన న్యాయమూర్తులు ఏం ఉపదేశిస్తారో ఆశ్చర్యంగా ఉంది!” అని అన్నారు.

గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు 30 రోజుల పెరోల్‌పై సీపీఎం నాయకురాలు బృందా కారత్‌ మాట్లాడుతూ.. “ఇప్పటికి 16 సార్లు పెరోల్‌ ఇచ్చారు. తన శిక్ష కాలంలో సగం సమయం అతను పెరోల్‌పైనే గడిపాడు. ప్రశ్న ఏంటంటే, మన చట్టం ఎందుకు వివక్ష చూపుతోంది? అతను తీవ్రమైన నేరస్థుడు కాదా? ఎంతో మంది అండర్‌ట్రయల్స్ సంవత్సరాలుగా జైలులో ఉన్నారు. కానీ వాళ్లకు పెరోల్ లేదా బెయిల్ నిబంధన లేదు. ఇది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. హరియాణా ప్రభుత్వం అతనికి ఇస్తున్న మద్దతుపైనా సందేహాలు వస్తున్నాయి” అని అన్నారు. 

నెటిజన్ల సెటైర్లు ఇలా.. 
‘‘ముందే పెట్రోలు ధరలు పెరిగిపోతున్నాయంటే ఆయన పది కార్లను వెంటేసుకుని తిరుగుతున్నాడు. లైఫ్‌ అంటే మినిమం ఇలా ఉండాలి’’

‘‘జోక్‌ ఏంటంటే.. 75 శాతం హాజరు లేకపోతే మేము పరీక్ష కూడా రాయలేం. కానీ, ఈ అత్యాచార దోషి జైలుకు హాజరుకాకుండా తన భారీ కాన్వాయ్‌తో తిరుగుతూ విలాసవంతమైన జీవితం ఆస్వాదిస్తున్నాడు’’

‘‘ఈ దేశంలో అసలు ఏమి జరుగుతోంది? మీడియాకూ అతడిని అత్యాచార దోషి అని చెప్పే ధైర్యం కూడా లేదు’’

‘‘ఈ దేశంలో ఏమి జరుగుతోంది సోదరా? వీళ్లకు ఇంత భద్రత ఎందుకు ఇస్తున్నారు? దీనికి మొత్తం ప్రజలే కారణం. ఈ చెత్త పరిస్థితుల నుంచి మనకు ఎప్పటికీ విముక్తి రాదేమో..’’

‘‘ప్రభుత్వం ఇతడి కాన్వాయ్‌లో ఇంకో 10 వాహనాలు చేర్చాలి. ఆయనకు జెడ్ ప్లస్ భద్రత ఇవ్వాలి. ఈ కనీస సౌకర్యాలు కూడా ఇవ్వలేకపోతే ఎలా?’’

‘‘మోదీ తన కాన్వాయ్‌ను 2 కార్లకు తగ్గించారు. అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీమ్ అంతకంటే పెద్ద వ్యక్తినా? పెట్రోల్, డీజిల్ ఖర్చుల నియంత్రణ చర్యల గురించి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయమే అతనికి తెలియనట్టుంది’’.

Advertisement
 
Advertisement
Advertisement