న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినాక ఆ దేశ ఇమ్మిగ్రేషన్ పాలసీని అత్యంత కఠినతరం చేశారు. దీంతో యుఎస్ఎలో స్థిరపడాలనుకునే వారి ఆశలు కలలుగానే మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో వీసా విధానంపై ఎన్డీటీవీతో మాట్లాడారు.
ప్రస్తుతం గ్రీన్కార్డు విషయంతో అమెరికా ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఇదివరకూ హెచ్-1 బీ వీసాదారులు గ్రీన్కార్డు విషయంలో అమెరికాలో ఉండి దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారం హెచ్1బీ వీసాదారులు తప్పనిసరిగా వారి సొంత దేశానికి వెళ్లి అక్కడినుండి గ్రీన్కార్డు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
తాజాగా దీనిపై మార్కో రుబియో వివరణ ఇచ్చారు..." గ్రీన్కార్డు కోసమై అమెరికా తీసుకువచ్చిన విధానం కేవలం భారతదేశానికి మాత్రమే ఉద్దేశించినది కాదు.ఇది అందరికీ వర్తిస్తుంది. వలసల వ్యవస్థను క్రమబద్ధీకరించి, మెరుగుపరచుకోవాలని అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది.20 మిలియన్లకు పైగా ప్రజలు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారు. అనేక సందర్భాల్లో గ్రీన్ కార్డ్ వ్యవస్థ దుర్వినియోగాలను కూడా మేము చూశాము. అందుకే మేము దానిని సంస్కరించాలని నిర్ణయించుకున్నాము. మీరు ఒక వ్యవస్థను సంస్కరించినప్పుడల్లా, కొన్ని అంతరాయాలు ఏర్పడతాయి. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కొంత అసౌకర్యం ఉంటుంది," అని జాతీయ మీడియాతో తెలిపారు.
అయితే తాత్కాలికంగా ఈ విధానం వల్ల ఇబ్బందులున్నా దీర్ఘకాలంలో ఈ విధానం స్థిరంగా మారుతుందని తెలిపారు. ముఖ్యంగా అమెరికాకు రావాలనుకునే భారతీయులు ఈ విధానం వల్ల దీర్ఘకాలంలో మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా మేలు పొందుతారని తాను భావిస్తున్నాని పేర్కొన్నారు.. ఇది వ్యక్తిగతంగా వారికి అమెరికాకు ఎంతో మేలు చేస్తోందన్నారు. ప్రస్తుతం మార్కో రూబియో భారత పర్యటనలో ఉన్నారు.


