సైకో లవర్స్‌.. ఐదుగురు మహిళలను దారుణంగా హత్య చేసి..! | Mandya Police Nabbed Man And His Girlfriend For Killing 5 Women | Sakshi
Sakshi News home page

ఐదుగురు మహిళలను హత్య చేసిన లవర్స్‌... మరో ఐదుగురికి స్కెచ్‌!

Aug 9 2022 9:15 PM | Updated on Aug 9 2022 9:15 PM

Mandya Police Nabbed Man And His Girlfriend For Killing 5 Women - Sakshi

ఐదుగురు మహిళలను దారుణంగా హత్య చేసి వారి మృతదేహాలను ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేశారు ఇద్దరు లవర్స్‌. మరో ఐదుగురిని హతమార్చేందుకు ప్రణాళిక చేస్తుండగా పడ్డుబడ్డారు.

బెంగళూరు: ఐదుగురు మహిళలను దారుణంగా హత్య చేసి వారి మృతదేహాలను ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేశారు ఇద్దరు లవర్స్‌. మరో ఐదుగురిని హతమార్చేందుకు ప్రణాళిక చేస్తుండగా పడ్డుబడ్డారు. ఈ సంఘటన కర్ణాటకలోని మండ్యాలో వెలుగు చూసింది. ఈ కేసులో 35 ఏళ్ల వ్యక్తితో పాటు అతడి ప్రేయసిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్య చేసినట్లు అంగీకరించిన నిందితుడు.. తన ప్రియురాలిని మహిళలు బలవంతంగా వ్యభిచారంలోకి దింపారని ఆరోపించాడు. అందుకే హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. నిందితుడు రామనగర జిల్లాలోని కుదుర్‌కు చెందిన సిద్ధలింగప్పగా గుర్తించారు పోలీసులు. బెంగళూరులోని అతడి ఇంటి నుంచి అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో మరో మహిళను హతమార్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. బెంగళూరులోని పీన్యాలో ఫాబ్రికేషన్‌ విభాగంలో పని చేస్తున్నాడని చెప్పారు. అతడి ప్రేయసిని చంద్రకళగా గుర్తించారు. ఈ హత్యలు చేసేందుకు నిందితుడికి సహకరించిన కారణంగా అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఐదుగురు మహిళల హత్యలు కొద్ది నెలల క్రితం జరిగాయి. అయితే.. మరో ఐదుగురు మహిళలను హత్య చేసేందుకు ఈ జంట ప్రణాళికలు రచిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జూన్‌ 8న మండ్యాలో కుల్లిపోయిన ఓ శవం దొరికింది. ఆ తర్వాత అదే స్థితిలో మరో మృతదేహం లభించింది. ఆ రెండు ప్రాంతాల మధ్య 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే.. ఈ రెండు మృతదేహాలు సగభాగం మాత్రమే లభించాయి. దీంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 9 టీంలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మిస్సింగ్‌ కేసులను పరిశీలించారు. కర్ణాటకతో పాటు పక్క రాష్ట్రాల్లోనూ మొత్తం 1,116 మిస్సింగ్‌ కేసులను పరిశీలించారు. చివరకు బెంగళూరులో నిందితుడు సిద్ధలింగప్పను అరెస్ట్‌ చేశారు. 

దర్యాప్తులో విస్తుపోయే విషయాలు.. 
కొన్నేళ్ల క్రితం వరకు సెక్స్‌ వర్కర్‌గా చేసిన చంద్రకళతో సంబంధం ఏర్పడిందని సిద్ధలింగప్ప పోలీసులకు తెలిపాడు. తాను ఏ విధంగా ఈ వృత్తిలోకి వచ్చిందో లింగప్పకి చెప్పింది చంద్రకళ. ఆమెను బలవంతంగా పడుపు వృత్తిలోకి దించిన వారిని చంపాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు లింగప్ప. మే నెలలో బెంగళూరులో తొలి హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేశాడు. మే 30, జూన్‌ 3న మైసూర్‌లో మరో ఇద్దరు మహిళలను చంద్రకళ సాయంతో హతమార్చాడు. మిగిలిన వారిని సైతం వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి: కట్నం కోసం భర్త వికృత రూపం.. డ్రగ్స్‌ మత్తులో ఫ్రెండ్స్‌తో కలిసి....

Advertisement
 
Advertisement
Advertisement