
పట్నా: బీహార్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఓటర్ల జాబితాను సవరిస్తున్న అధికారులకు పలు కంగుతినే అంశాలు కనిపించాయి. సెప్టెంబర్ 30న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో అక్రమ వలసదారుల పేర్లు కనిపించవని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు.
బీహార్లో ఓటర్ల జాబితాపై ఇంటెన్సివ్ సమీక్ష కోసం ఇంటింటికీ వెళ్లి నిర్వహించిన సర్వేలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్కు చెందినవారు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా ఉన్నట్లు తేలిందని భారత ఎన్నికల సంఘం(ఈసీఐ)అధికారులు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా మేజిస్ట్రేట్లు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వివిధ పంచాయతీలలో ఇంటింటికీ వెళ్లి బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ)చేస్తున్న పనిని ధృవీకరిస్తున్నారు. బూత్-స్థాయి అధికారుల ఇంటింటి సందర్శనల సమయంలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్లకు చెందిన ఓటర్లను కనుగొన్నారని ఈసీఐ అధికారులు తెలిపారు.
ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. దేశంలో స్థిరపడిన బంగ్లాదేశ్, మయన్మార్లకు చెందిన వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో వీరు ఓటర్లుగా మారడంపై చర్చ మొదలయ్యింది. కాగా అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్నాయి.