
ఢిల్లీ: పాక్ ఉగ్రవాదులను భారత్కు అప్పగించాల్సిందేనని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసునంటూ ఆయన వ్యాఖ్యానించారు. భారత్ కేవలం పీవోకే, టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడుతోంది. సింధూ జలాల నిలిపివేతపై యథాతథ స్థితి కొనసాగుతోంది. ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పించే వ్యవస్థను రుపుమాపాలి’’ అని జైశంకర్ పేర్కొన్నారు.
పాకిస్థాన్తో చర్చలు ఉగ్రవాదంపై మాత్రమే ఉంటాయని ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారని జైశంకర్ గుర్తు చేశారు. ఉగ్రవాదంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని జైశంకర్ చెప్పారు.
#WATCH | Delhi | "Our relations and dealings with Pakistan will be strictly bilateral. That is a national consensus for years, and there is absolutely no change in that. The prime minister made it very clear that talks with Pakistan will be only on terror. Pakistan has a list of… pic.twitter.com/j9lugNSpsd
— ANI (@ANI) May 15, 2025
కాగా, ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్తో తాజా ఉద్రిక్తతలు, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారుల భద్రతపై కేంద్రం నిశితంగా దృష్టి పెట్టింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్కు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. మంత్రి కాన్వాయ్లో మరో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను చేరుస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జైశంకర్కు భద్రతను 2023లో వై నుంచి జెడ్ కేటగిరీకి పెంచారు. ఇప్పటికే రెండో అత్యున్నత స్థాయి భద్రత. అందులో భాగంగా 33 మందితో కూడిన సీఆర్పీఎఫ్ కమాండోల బృందం 24 గంటలూ ఆయనను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది.
జెడ్ కేటగిరీలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), 4 నుండి ఆరుగురు స్థానిక పోలీసు మంది కమాండోలతో సహా 22 మంది సిబ్బంది, ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్ వాహనాలుంటాయి. సాధారణంగా ఉన్నత స్థాయి రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, బెదిరింపులను ఎదుర్కొంటున్న వారికి ఈ స్థాయి భద్రత అందిస్తారు. కేంద్ర రక్షణ జాబితాలోని వీఐపీ భద్రతా కవర్ జెడ్–ప్లస్ (అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్), జెడ్, వై, వై–ప్లస్, ఎక్స్ దాకా ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా దాదాపు 200 మందికి సీఆర్పీఎఫ్ వీఐపీ భద్రతా సంరక్షణ ఉంది.