పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌పై జైశంకర్‌ సంచలన ఆరోపణ | Jaishankar Allegations On Pak Leadership And Army Chief | Sakshi
Sakshi News home page

పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌పై జైశంకర్‌ సంచలన ఆరోపణ

May 22 2025 10:51 AM | Updated on May 22 2025 11:09 AM

Jaishankar Allegations On Pak Leadership And Army Chief

ఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత విదేశాంగమంత్రి జైశంకర్‌ సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం దాడితో పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌కు సంబంధం ఉందని అన్నారు. పహల్గాం దాడికి పాకిస్తాన్‌ నేతల జిహాదీ మైండ్‌ సెట్‌ కారమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌ డెన్మా‍ర్క్‌, నెదర్లాండ్స్‌ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా తాజాగా జైశంకర్‌ మీడియాతో మాట్లాడుతూ..‘కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్‌, పాక్‌ మధ్య మాత్రమే చర్చలు జరిగాయి. ఈ ఒప్పందంపై భారత్‌, పాక్‌ కలిసి చర్చించుకున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి భారత్ అనేక దేశాలకు సమాచారం ఇచ్చిందని, అందులో అమెరికా కూడా ఉందని స్పష్టం చేశారు. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం చేసింది తానేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

 

ఇదే సమయంలో పహల్గాం దాడితో పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌కు సంబంధం ఉంది అని చెప్పుకొచ్చారు. అలాగే, కశ్మీర్ భారతదేశంలో భాగమే. ఏ దేశం కూడా తమ భూభాగంలో కొంత భాగం గురించి చర్చించదు. కశ్మీర్‌లోని ఒక ప్రాంతం మాత్రమే పాకిస్తాన్ పరిధిలో ఉంది. వారు ఎప్పుడు దానిని ఖాళీ చేస్తారో అనే విషయమై.. మేము వారితో చర్చించాలనుకుంటున్నాము అని అన్నారు.

మరోవైపు.. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌కు పదోన్నతి ఇవ్వడంపై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్పందించారు. ఆసిఫ్‌ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి ఇవ్వడమనేది పూర్తిగా తన నిర్ణయమేనని షరీఫ్‌ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఆపరేషన్‌ సిందూర్‌ను ఎదుర్కోవడంలో మునీర్‌ వైఫల్యం చెందినా ప్రమోషన్‌ ఇచ్చారని సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వెల్లువెత్తుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement