
భారత్లో కనీస రేటు కంటే తక్కువ
ఇలాగే కొనసాగితే తగ్గనున్న జనాభా
ప్రపంచంలో మరే దేశానికి లేనంతటి యువశక్తి భారత్ సొంతం. మొత్తం జనాభాలోనూ చైనాను అధిగమించి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచాం. అయితే ప్రపంచవ్యాప్త ట్రెండుకు అనుగుణంగా భారత్లో కూడా జననాల రేటు భారీగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. జనాభా పెరుగుదల స్థిరంగా కొనసాగాలంటే జననాల (టీఎఫ్ఆర్–టోటల్ ఫెర్టిలిటీ) రేటు కనీసం 2.1 ఉండాలి.
అంటే ప్రతి మహిళ కనీసం ఇద్దరిని కనాలన్నమాట. దీన్ని భర్తీ రేటుగా పిలుస్తారు. కానీ భారత్లో టీఎఫ్ఆర్ ఏకంగా 1.9కి పడిపోయిందని ‘సంతాన సంక్షోభం’ పేరిట ఐక్యరాజ్యసమితి జనాభా కార్యకలాపాల నిధి (యూఎన్ఎఫ్పీఏ) విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. దాంతో జననాల రేటు తగ్గుదల ప్రభావం మన దేశంపై అంతిమంగా ఎలా ఉండనుందన్న చర్చ జోరందుకుంది.
ఇదీ పరిస్థితి!
1.9 టీఎఫ్ఆర్ కారణంగా భారత్లో జనాభా పెరుగుదల నానాటికీ తగ్గి 40 ఏళ్లకు ఆగిపోతుందని యూఎన్ఎఫ్పీఏ అంచనా వేసింది. అప్పటికి దేశ జనాభా 170 కోట్లకు చేరి అక్కడి నుంచి తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. కానీ భారత్లో టీఎఫ్ఆర్ శరవేగంగా 1.29కు పడిపోతుందని గతేడాది లాన్సెట్ జరిగిన అధ్యయనం శాస్త్రీయంగా అంచనా వేసింది. అదే జరిగితే దేశ జనాభాలో తగ్గుదల 40 ఏళ్లకంటే చాలా ముందే మొదలయ్యే వీలుంది.
1950ల్లో ఒక్కో భారత మహిళ సగటున ఏకంగా ఆరుగురిని కనేది! 1980ల నాటికి అది 4.6కు తగ్గింది. అక్కడినుంచి ఇద్దరు పిల్లలు చాలనే పరిస్థితికి రావడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది. చిన్న కుటుంబాలు పరిపాటిగా మారిపోయాయి. మహిళల ఆర్థిక స్వాతంత్య్రం పెరిగిన కొద్దీ వారు కనే పిల్లల సంఖ్య మరింతగా తగ్గుతూ వస్తోంది. ఎక్కువమందిని కని కెరీర్ను పణంగా పెట్టేందుకు వారు ఇష్టపడటం లేదు. పిల్లల పెంపకంలో వారికి భర్త మద్దతు లేకపోవడమూ దీనికి కారణమే.
ఆందోళన అక్కర్లేదు!
జననాల రేటు (టీఎఫ్ఆర్) తగ్గితే జనాభాపరంగా చాలా మార్పులు చోటుచేసుకుంటా యి. ముఖ్యంగా యువ శ్రామిక శక్తి క్రమంగా తగ్గిపోతుంది. వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. ‘‘2050 నాటికి భారత జనాభాలో వృద్ధుల సంఖ్య ఐదో వంతుకు చేరుతుంది. చైనాది ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఒకే సంతానం నిబంధనను దశాబ్దాలుగా కఠినంగా అమలు చేయడమే అందుకు కారణం’’ అని జనాభా నిపుణులు చెబుతున్నారు.
‘‘జనాభా పెరుగుదలను బాగా తగ్గించిన దక్షిణాది రాష్ట్రాలన్నీ దాని పర్యవసానాలను ఇప్పటికే అనుభవిస్తున్నాయి. మొత్తం 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీఎఫ్ఆర్ ఇప్పటికే 2.1 కంటే చాలా తక్కువకు పడిపోయింది. బిహార్ (3), మేఘాలయ (2.9), ఉత్తరప్రదేశ్ (2.7) వంటివి మాత్రమే ఇందుకు మినహాయింపు’’ అని ఇంటర్నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ డెమోగ్రఫీ ప్రొఫెసర్ శ్రీనివాస్ గోలి వివరించారు.
‘‘అంతమాత్రాన టీఎఫ్ఆర్ తగ్గుదలను చూసి ఇప్పటికిప్పుడు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దీనివల్ల కార్మిక శక్తి భారీగా తగ్గుతుందన్నది అపోహ మాత్రమే. నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ప్రాంతాల మధ్య వలసలను మరింతగా ప్రోత్సహించడం ద్వారా సమస్యను సులువుగా అధిగమించవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. అయితే వృద్ధుల సంఖ్య పెరుగుదల ఒక్కటే మున్ముందు భారత్కు సమస్యగా మారే ఆస్కారముందని ఆయన అంచనా వేశారు.
‘‘వయోపరమైన అంతరం నానాటికీ పెరిగిపోయి చివరికి పెద్దవాళ్ల ఆలనాపాలనా చూసే వారసుల సంఖ్య తగ్గిపోతుంది. ఆ పరిస్థితుల్లో వృద్ధుల సంరక్షణకు అవసరమైన వసతులు, ప్రభుత్వపరమైన సౌకర్యాలు మన దగ్గర బాగా తక్కువే’’ అని గుర్తు చేశారు. 60–75 ఏళ్ల వయసు వారికి ఇప్పటిమాదిరిగా తగిన ఉపాధి అవకాశాలు కూడా మున్ముందు సవాలుగానే మారవచ్చని అహ్మదాబాద్లోని ఎల్జే వర్సిటీ ప్రొఫెసర్ అమితాబ్ కుందు అభిప్రాయపడ్డారు.
– సాక్షి, నేషనల్ డెస్క్