గల్వాన్‌ ఎఫెక్ట్‌: చైనా ఉత్పత్తులపై భారీ దెబ్బ

Galwan Valley: 43 pc of Indians avoided Chinese items in last 12 months - Sakshi

లడఖ్‌లోని గల్వాన్‌ వ్యాలీలో భారతీయ, చైనా సైన్యాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ వల్ల చైనాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గల్వాన్‌ ఘర్షణ జరిగిన ఏడాది తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ సర్వే ప్రకారం.. గత 12 నెలల్లో 43 శాతం మంది భారతీయులు చైనా తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయలేదని సర్వేలో తేలింది. గత ఏడాది కాలంలో 'మేడ్ ఇన్ చైనా' ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారిలో 60 శాతం మంది 1-2 వస్తువులను మాత్రమే కొనుగోలు చేసినట్లు ఈ సర్వే పేర్కొంది.

గల్వాన్‌ వ్యాలీ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని దేశవ్యాప్తంగా నిరసన కారులు డిమాండ్ చేశారు. ఈ సంఘటన తర్వాత దేశంలో స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడానికి టిక్ టాక్, అలీ ఎక్స్ ప్రెస్ వంటి చైనాకు చెందిన 250కి పైగా యాప్స్ ను కేంద్ర ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే. నవంబర్ 2020లో పండుగ సీజన్ కాలంలో లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో 71 శాతం మంది భారతీయ వినియోగదారులు 'మేడ్ ఇన్ చైనా' ఉత్పత్తులను కొనుగోలు చేయలేదని తేలింది. భారతదేశంలోని 281 జిల్లాల్లో 18,000 మంది ప్రజలు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను తెలిపినట్లు లోకల్ సర్కిల్స్ తెలిపింది. 

చైనా ఉత్పత్తులను కొనడానికి ప్రధాన కారణం ఖర్చు తక్కువగా ఉండటమే ప్రధానం అని ప్రజలు తెలిపారు. గత ఏడాది కాలంలో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసిన 70 శాతం మంది ఖర్చు తక్కువగా ఉండటమే వల్ల అలా చేసినట్లు తెలిపారు. ఈ కాలంలో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారిలో 14 శాతం మంది 3-5 ఉత్పత్తులను కొనుగోలు చేయగా, 7 శాతం మంది 5-10 వస్తువులను కొనుగోలు చేశారని చెప్పారు. ఎలక్ట్రికల్ మెషినరీ, ఉపకరణాలు,  ఔషధాలు, మందులతో సహా అనేక ఉత్పత్తుల కోసం భారతదేశం చైనాపై ఆధారపడుతుంది. భారతదేశం ఇంటర్మీడియట్ వస్తువుల దిగుమతిలో చైనా వాటా 12 శాతం ఉంటే, మూలధన వస్తువులలో 30 శాతం, తుది వినియోగ వస్తువులలో 26 శాతం ఉంది. మొత్తానికి ఈ గల్వాన్ సంఘటన వల్ల దేశీయ ఉత్పత్తుల కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపినట్లు తెలుస్తుంది. దీని వల్ల ఎంత కొంత చైనా ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది.

చదవండి: దేశంలోనే అత్యంత విలువైన స్టార్ట‌ప్‌ కంపెనీగా బైజుస్

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top