బెంగళూరు: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మామ (75), కేసు సామరస్యంగా పరిష్కరించుకుంటామని బాధితురాలు (కోడలు) దయతల్చడంతో హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. వివరాలు.. బాధిత మహిళ.. భర్త, అత్త, మామ నిరంతరం లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై వారిపై కేసు నమోదైంది. నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మామ బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ వేశాడు, తన వయసు 75 సంవత్సరాలని, 9 నెలలుగా కారాగారంలో ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నాడు.
కుటుంబ గొడవలతో తప్పుడు ఫిర్యాదు చేశారన్నాడు. దీనిని ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకిస్తూ, పిటిషనర్పై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని, బెయిల్ నిరాకరించాలని కోరారు. అయితే బాధిత మహిళ.. కేసును సామరస్యంగా పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతోంది. బెయిలు ఇవ్వవచ్చని తెలిపింది. జస్టిస్ జిఎస్ కమల్ వాదనలను ఆలకించి బెయిలుకు ఆమోదించారు. రూ.లక్ష పూచీకత్తు, పలు నిబంధనలను పాటించాలని ఆదేశించారు. కేసు విచారణ యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు.


