ఐదుగురు భారతీయులను అప్పగించిన చైనా

China Army Hands Over 5 Indians From Arunachal on September 12th - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌-చైనా సరిహద్దులో చైనా సైనికుల చేతికి చిక్కిన అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యువకులను చైనా శుక్రవారం అప్పగించింది. చైనా సరిహద్దులో వీరిని భారత సైన్యానికి అప్పగించింది. అపహరణకు గురయ్యారని భావిస్తున్న అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యువకుల జాడ తెలిసిందని, వారిని చైనా శుక్రవారం అప్పగిస్తానని తెలిపిందని ఇటీవ‌ల కేంద్ర స‌హాయ మంత్రి కిర‌ణ్ రిజిజు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ఈ ప్ర‌క్రియ ముగిసిన నేప‌థ్యంలో ఆ ఐదుగురు భారతీయ పౌరులను చైనా విడిచిపెట్టింది.

ఆ ఐదుగురు అడవిలో వేటకు వెళ్లి పొరపాటుగా వాస్తవాధీన రేఖను దాటినట్లు భారత ఆర్మీ ప్ర‌క‌టించింది. శుక్రవారం ఉదయం కిభిథు సరిహద్దు పోస్టు గుండా భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌కు ఆ ఐదుగురిని భారత సిబ్బంది తీసుకొచ్చారు. వారితో పాటు అడవిలోకి వెళ్లిన మరో ఇద్దరు ఈ విషయాన్ని వారి కుటుంబాలకు తెలియజేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. అనంతరం ఇరు దేశాల మధ్య చర్చలు జరిగి వారిని విడిచిపెట్టడానికి అంగీకరించారు. మొద‌ట త‌మ‌కు వారి జాడ గురించి తెలియ‌ద‌న్న‌ చైనా అనంత‌రం వారు త‌మ వ‌ద్దే ఉన్న‌ట్లు ప్ర‌క‌టించి విడుదల చేసింది. చైనా సైన్యం విడుదల చేసిన యువకులను తోచ్ సింగ్కం, ప్రసాత్ రింగ్లింగ్, డోంగ్టు ఎబియా, తనూ బేకర్, న్గారు దిరిగా గుర్తించారు.

చదవండి: భారత్‌- చైనా: 5 అంశాల్లో కుదిరిన ఏకాభిప్రాయం!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top