చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ సూపర్‌ సక్సెస్‌ | India's Moon Mission: Chandrayaan-3 Soft-Landing On Lunar South Pole, Live Updates - Sakshi
Sakshi News home page

శెభాష్‌ విక్రమ్‌.. చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ సక్సెస్‌.. చంద్రుడిపై చరిత్ర సృష్టించిన భారత్‌

Aug 23 2023 5:24 PM | Updated on Aug 23 2023 7:11 PM

Chandrayaan 3 Will Land Soon Updates - Sakshi

చంద్రుడిపై అదీ ఎవరూ వెళ్లని దక్షిణ ధ్రువంపై తొలి అడుగు భారత్‌ది.. 

బెంగళూరు:  జయహో భారత్‌. ఇస్రో అంచనాలు తప్పలేదు. యావత్‌ భారతం ఉత్కంఠంగా ఎదురు చూసిన క్షణాలు ఫలించాయి. ఎవరూ చూడని.. అడుగు మోపని చంద్రుడి భూభాగంలో భారత్‌ తొలి అడుగు వేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రయాన్‌-3 ప్రయోగంతో చంద్రుడి దక్షిణ ధ్రువంలో అడుగు మోపిన తొలి దేశంగా ఘనత సాధించింది. 

ఓటమి గెలుపునకు నాంది..  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాన్‌-2 వైఫల్యంతో మంచి పాఠాలే నేర్చింది. అందుకే చంద్రయాన్‌-3లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా తీర్చిదిద్దింది.  జులై 15వ తేదీన చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని ఏపీలోని శ్రీహారి కోట నుంచి చేపట్టింది. ఎల్‌వీఎం3-ఎం4 భూకక్ష్యలోకి విజయవంతంగా చేరింది. ఆపై 18 రోజుల వ్యవధిలో ఐదుసార్లు కక్ష్యను పెంచుకుంటూ పోసాగారు. ఆగస్టు 1వ తేదీన ట్రాన్స్‌ లునార్‌ కక్ష్య.. 5వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. 

ఆగస్టు 17వ తేదీన వ్యోమనౌకలోని విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవత్‌లో కూడిన ల్యాండర్‌ మాడ్యూల్‌.. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా విడిపోయింది. సొంతంగా చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించడం ప్రారంభించింది. ఆ తర్వాత రెంసార్లు డీ ఆర్బిట్‌ ప్రక్రియలు చేపట్టి జాబిల్లి ఉపరితలానికి చేరువ చేశారు.

శెభాష్‌ విక్రమ్‌
41 రోజుల ప్రయాణంలో అలిసిపోని విక్రమ్‌ ల్యాండర్‌.. ఇస్రో శాస్త్రవేత్తల అంచనాలను వమ్ము చేయలేదు. ఊహించినట్లుగా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ దిశగా ప్రయాణించి చంద్రుడిపై అడుగు మోపింది. సాయంత్రం 5.44 గంటల ప్రాంతంలో ల్యాండర్‌ మాడ్యూల్‌.. నిర్దేశించిన ప్రాంతానికి చేరింది. ఇస్రో సైంటిస్టులు పంపించిన ఆటోమేటిక్‌ ల్యాండింగ్‌ సీక్వెన్స్‌ కమాండ్‌ను అనుసరించి.. తన కృత్రిమ మేధ సాయంతో సాఫ్ట్‌ ల్యాండింగ్‌ మొదలుపెట్టింది. నాలుగు థ్రాటబుల్‌ఇంజిన్లను ప్రజ్వలించి వేగాన్ని తగ్గించుకుని.. రఫ్‌ బ్రేకింగ్‌ దశను ముగించుకుని చంద్రుడి ఉపరితం చేరుకుంది. 

చంద్రుడికి ఏడున్నర కిలోమీట్ల ఎత్తు నుంచి ల్యాండర్‌ తన దిశను మార్చుకుంది. దశల వారీగా ఎత్తు దగ్గించుకుని.. ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశంలో కాలుమోపింది.   తద్వారా అంతరిక్ష రంగంలో సువర్ణాక్షరాలతో భారత్‌ సరికొత్త చరిత్ర లిఖించింది.

నెక్ట్స్‌ ఏంటంటే..
దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ ల్యాండర్‌ దిగగా.. చంద్రుడిపై ఆ ప్రాంతంలో మట్టిని రోవర్‌ పరిశోధిస్తుంది. అలాగే.. రెండువారాలపాటు మట్టిలో గడ్డ కట్టిన మంచు అణువులైనా అన్వేషణ కొనసాగనుంది. 

  

ఇదీ చదవండి: చంద్రయాన్-3 హీరోలు.. ఆ వెనుక ఉన్న మేధస్సు వీళ్లదే..

Advertisement
 
Advertisement
Advertisement