సీబీఎస్‌ఈ టెండర్‌లో సంచలన ట్విస్టులు? | CBSE Tender Twist: Telangana Link Raises Eyebrows | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ టెండర్‌లో సంచలన ట్విస్టులు?

May 30 2026 12:18 PM | Updated on May 30 2026 12:22 PM

CBSE Tender Twist: Telangana Link Raises Eyebrows

న్యూఢిల్లీ: దాదాపు 17 లక్షల మంది సీబీఎస్‌ఈ విద్యార్థుల జవాబు పత్రాల స్కానింగ్‌.. డిజిటల్‌ మూల్యాంకన బాధ్యతలు చేపట్టిన సంస్థ ఎంపిక వెనుక అసలు ఏమి జరిగింది? టెండర్‌ నిబంధనలు ఎందుకు పదేపదే మారాయి? ఒకసారి అనర్హత పొందిన సంస్థ చేతికే మళ్లీ ఎలా వెళ్లాయి? ఒక విద్యార్థి చేసిన పరిశోధన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు విద్యా వర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.

2025-26 విద్యాసంవత్సరంలో సీబీఎస్‌ఈ తొలిసారిగా భారీ స్థాయిలో ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ విధానాన్ని అమలు చేసింది. ఇందుకోసం లక్షలాది జవాబు పత్రాలను స్కాన్‌ చేసి డిజిటల్‌గా మూల్యాంకనం చేసే బాధ్యతను ఒక ప్రైవేట్‌ సంస్థకు అప్పగించింది. అయితే ఈ టెండర్‌ ప్రక్రియపై ఇప్పుడు తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

12వ తరగతి విద్యార్థి సార్థక్‌ చేసిన పరిశోధన ప్రకారం.. ఈ టెండర్‌ను చివరకు దక్కించుకున్న కోయెంప్ట్‌ ఎడ్యూటెక్‌ సంస్థ గతంలో గ్లోబరెనా టెక్నాలజీస్‌ పేరుతో పనిచేసింది. 2019 తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల వివాదంలో ఈ సంస్థ పేరు తీవ్రంగా వినిపించింది. అనంతరం సంస్థ పేరు మారి కోయెంప్ట్‌గా మారినట్లు సమాచారం.

అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ టెండర్‌ ఒకసారి కాదు, మూడుసార్లు జారీ కావడం. తొలి టెండర్‌ రికార్డులే అందుబాటులో లేకపోవడం, రెండో టెండర్‌లో పాల్గొన్న అన్ని కంపెనీలు సాంకేతిక అర్హతల్లో విఫలమవడం, ఆ తర్వాత మూడో టెండర్‌లో నిబంధనలు మారిన వెంటనే కోయెంప్ట్‌ విజేతగా నిలవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.

సీబీఎస్‌ఈ టెండర్ వివాదం: కీలక అంశాలు

🔹 17 లక్షల విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకన టెండర్‌పై వివాదం

🔹 2019 తెలంగాణ ఇంటర్‌ ఫలితాల వివాదంతో వార్తల్లో నిలిచిన గ్లోబరెనా టెక్నాలజీస్‌ (ప్రస్తుత కోయెంప్ట్‌ ఎడుటెక్‌)కు కాంట్రాక్ట్

🔹 టెండర్‌ను మూడుసార్లు జారీ చేసిన సీబీఎస్‌ఈ

🔹 చివరి దశలో నిబంధనల మార్పుల తర్వాత కోయెంప్ట్‌కు టెండర్ దక్కినట్లు ఆరోపణలు

సార్థక్‌ జరిపిన విశ్లేషణ ప్రకారం.. రెండో టెండర్‌ నుంచి మూడో టెండర్‌కు వెళ్లే మధ్యకాలంలో అనేక కీలక నిబంధనలు సవరించబడ్డాయి. గతంలో బ్లాక్‌లిస్ట్‌ అయిన సంస్థలకు అడ్డుకట్ట వేసే షరతులు సడలించడం, సాఫ్ట్‌వేర్‌ నాణ్యత ప్రమాణాలను తగ్గించడం, డేటా సెంటర్‌ యాజమాన్యానికి సంబంధించిన నిబంధనలను తొలగించడం, అనుభవ ప్రమాణాలను మార్చడం వంటి చర్యలు చోటుచేసుకున్నాయని ఆ కుర్రాడు పేర్కొన్నాడు. అంతేకాదు, సిస్టమ్‌ విఫలమైతే సంస్థను భవిష్యత్‌లో బ్లాక్‌లిస్ట్‌ చేసే అధికారాన్ని కూడా చివరి దశలో తొలగించినట్లు ఆరోపించాడు. 

జవాబు పత్రాల స్కానింగ్‌లో ఖచ్చితత్వానికి సంబంధించిన తప్పనిసరి ప్రమాణాలను సైతం సడలించారని సార్థక్‌ చెప్పడంతో.. ఈ మార్పులన్నీ ఒకే సంస్థకు అనుకూలంగా జరిగాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

టెండర్ రూల్స్‌లో మార్పులు

➡️ గతంలో బ్లాక్‌లిస్ట్ అయిన సంస్థలను అనర్హులుగా ప్రకటించే నిబంధన తొలగింపు

➡️ సాఫ్ట్‌వేర్ నాణ్యత ప్రమాణం CMMI Level-5 నుంచి Level-3కు తగ్గింపు

➡️ సొంత డేటా సెంటర్ తప్పనిసరి నిబంధన రద్దు

➡️ థర్డ్‌పార్టీ క్లౌడ్ హోస్టింగ్‌కు అనుమతి

➡️ స్కానింగ్ ఖచ్చితత్వానికి సంబంధించిన కఠిన ప్రమాణాల సడలింపు

➡️ CERT-In భద్రతా ఆడిట్ నిబంధన తొలగింపు

➡️ పొరపాట్లపై జరిమానాల బదులు ఆలస్యాలపై జరిమానాల విధానం

ఇటీవల సీబీఎస్‌ఈ రీవాల్యూయేషన్‌ పోర్టల్‌లో వెలుగుచూసిన సైబర్‌ భద్రతా లోపాలు, అనధికార యాక్సెస్‌ ఘటనలు ఈ వివాదానికి మరింత బలం చేకూర్చాయి. భద్రతా పరీక్షలు పూర్తయ్యాయా? లేదంటే నిబంధనలను పక్కనబెట్టి వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెండర్‌ ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని, సీఏజీ ఆడిట్‌ నిర్వహించాలని, పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ఈ ఆరోపణలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

లేవనెత్తుతున్న ప్రశ్నలు

❓ నిబంధనలు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?

❓ మార్పుల వల్ల ఎవరు లబ్ధి పొందారు?

❓ భద్రతా ప్రమాణాలు ఎందుకు తగ్గించారు?

❓ తొలి టెండర్ వివరాలు ఎందుకు కనిపించడం లేదు?

❓ విద్యార్థుల డేటా భద్రతకు ఎలాంటి హామీ ఉంది?
 

అయితే ఇప్పటివరకు ఈ ఆరోపణలపై సీబీఎస్‌ఈ లేదా కోయెంప్ట్‌ ఎడ్యూటెక్‌ సంస్థ నుంచి అధికారిక వివరణ వెలువడలేదు. కానీ ఒక విద్యార్థి చేసిన ఈ పరిశోధన ఇప్పుడు దేశంలోని అతిపెద్ద విద్యా బోర్డుల్లో ఒకటైన సీబీఎస్‌ఈ టెండర్‌ ప్రక్రియపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. సమాధానాలు ఎప్పుడు వస్తాయన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రెకెత్తిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement