
బెంగళూరు,సాక్షి: బస్సు డ్రైవర్లతో గొడవ పడతున్నారా? అయితే,తస్మాత్ జాగ్రత్త. ఓ యువతి తనతో గొడపడిందని బస్సుతో ఢీకొట్టి ప్రాణాలు తీసేందుకు ఓ బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ ఘటనలో యువతి తృటిలో ప్రాణలు దక్కించుకుంది. ప్రస్తుతం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బెంగళూరులో బీఎంటీసీ (బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్) డ్రైవర్ అరాచకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. నగరంలోని ఓ సిగ్నల్ దగ్గర యువతిపైకి బస్సును పోనిచ్చాడు. యువతి తనతో గొడవ పడిందన్న కారణంతో డ్రైవర్ కర్కశంగా వ్యవహరించాడు. బస్సు ముందు యువతి ఉందని తెలిసినా ఆమెను తోసుకుంటూ బస్సును నడిపాడు డ్రైవర్. అయితే, ఆ ప్రమాదం నుంచి యువతి తృటిలో తప్పించుకుంది.

వివరాల్లోకి వెళితే.. కేఏ57ఎఫ్2046 నంబర్ గల బస్సు డ్రైవర్ మే 23న చినస్వామి స్టేడియం సిగ్నల్ వద్ద ఓ యువతిని ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. మ్యూజియం రోడ్ నుంచి ఎంజీ రోడ్ వైపు వెళ్తున్న సమయంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు ముందు బస్సు డ్రైవర్,యువతి మధ్య వాగ్వాదం జరిగింది. అందుకు కారణాలేంటనేది తెలియాల్సి ఉండగా.. బస్సు డ్రైవర్తో గొడవ జరిగిన తర్వాత యువతి సిగ్నల్ వద్ద ఆందోళన చేపట్టేందుకు ప్రయత్నించింది.
డ్రైవర్ ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయలేదు. లేదంటే పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. పైగా, యువతిని ఢీకొట్టేందుకు బస్సు నడపడంతో ఉద్దేశపూర్వకంగానే సదరు బస్సు డ్రైవర్ యువతి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడనే స్పష్టంగా తేలింది. మరోవైపు, ఈ దుర్ఘటనపై బెంగళూరు వాసులు నిత్యం ప్రాణ భయంతోనే కాదు, సురక్షితమైన బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కోరుతున్నారు. వీడియోతో ఆధారంగా బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.