అయోధ్య: అయోధ్యలో శ్రీరామాలయ నిర్మాణ పనులు ఏప్రిల్ 30వ తేదీకల్లా పూర్తవుతాయని భావిస్తున్నట్లు ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,900 కోట్లు కాగా, జీఎస్టీ సహా ఇప్పటికే రూ.1,600 కోట్లు చెల్లించామన్నారు. ఆలయ నిర్మాణ కమిటీ రెండు రోజుల సమావేశం ముగిసిన అనంతరం శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ ప్రాజెక్టులో కీలక నిర్మాణాల బాధ్యత తీసుకున్న లార్సెన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టెన్సీ సంస్థలు పనులు పూర్తి చేసి ఏప్రిల్ 30వ తేదీ కల్లా వైదొలగుతాయని నృపేంద్ర మిశ్రా (Nripendra Misra) వివరించారు. అదే రోజుకు అన్ని రకాల బిల్లుల చెల్లింపులు, ఇతర పనులు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఈ రెండు కంపెనీలు తాము చేపట్టిన పనులకు మూడేళ్ల వారెంటీ ఇచ్చాయని నృపేంద్ర మిశ్రా అన్నారు.
నిర్వహణ పనుల నిమిత్తం నిపుణుల బృందాలను ఆలయ సముదాయంలోనే అందుబాటులో ఉంచుతాయన్నారు. ఏప్రిల్ 30వ తేదీ తర్వాత ఆలయ సముదాయం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధీనంలోకి వస్తుందని మిశ్రా వివరించారు.
కాగా, అయోధ్య శ్రీరామాలయ నిర్మాణాన్ని 2020 ఆగస్టు 5న ప్రారంభించారు. 2024 జనవరి 22 నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. భక్తుల నుంచి సేకరించిన విరాళాలతో ఆలయ నిర్మాణాన్ని తలపెట్టారు. రూ. 3,000 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి.
చదవండి: ఫిబ్రవరిలో ఉక్కపోత.. ఐఎండీ


