ఊట్కూర్: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంతో జిల్లా సస్యశ్యామలం కానుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మండలంలోని బాపూర్ శివారు లో కొనసాగుతున్న ఎత్తిపోతల పనులను బుధవారం ఆయన పరిశీలించి అధికారులతో మాట్లాడి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకం పనులు యుద్ధప్రాతిపాదికన కొనసాగుతున్నాయని, ఏడాదిలోపు ఒక రూపం వస్తుందని తెలిపారు. ఏళ్లుగా ఎంతోమంది నాయకులు ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డ రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే జిల్లాకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారన్నారు. రూ.5 వేల కోట్లు మంజూరు చేశారని.. 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. ఈ ప్రాంత రైతులు విలువైన భూములను త్యాగం చేయడంతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని.. భూములు కోల్పోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం వారి ఖాతా లో జమ అవుతుందని వివరించారు. భవిష్యత్లో ఈ ప్రాంతమంతా పచ్చదనంతో కళకళలాడనుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్, తహసీల్దార్ అశోక్కుమార్, ఎస్ఈ శ్రీధర్, ఈఈ మహ్మద్ అబ్దు ల్ రహీం, ఆర్ఐ కృష్ణారెడ్డి, విజయలక్ష్మి, నర్సింహ, నాయకులు యజ్ఞేశ్వర్రెడ్డి, జనార్దన్రెడ్డి, సూర్యప్రకాష్రెడ్డి, కోరం మహేష్రెడ్డి పాల్గొన్నారు.


