కోస్గి రూరల్: ౖరెతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు పొందాలని ప్రొ. జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాస్త్రవేత్తలు రాజేశ్వర్రెడ్డి, రాజా మధుశేఖర్ అన్నారు. సోమవారం మండలంలోని చంద్రవంచలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం పరిగి ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు–2026 కార్యక్రమం నిర్వహించగా.. వారు హాజరై వానాకాలం సాగుపై అవగాహన కల్పించారు. వానాకాలంలో అధిక దిగుబడినిచ్చే వరి వంగడాల ఎంపిక, పచ్చిరొట్ట ఎరువులతో నేలసారం పెంపొందించే విధానం, అధిక రసాయన ఎరువుల వినియోగంతో పర్యావరణం, నేల ఆరోగ్యానికి కలిగే నష్టాలు, డ్రిప్, స్ప్రింక్లర్లతో నీటి పొదుపు తదితర అంశాల గురించి క్షుణ్ణంగా వివరించారు. వ్యవసాయ, ఉద్యానశాఖల ద్వారా అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి వాటిని పొందే విధానాలను తెలియజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారులు అజయ్, వినోద్, సర్పంచ్ విద్యావతి, ఆదర్శ రైతులు వెంకట్రాములు, అనిత, సాయిరెడ్డి పాల్గొన్నారు.


