●
మరికల్: ఆరుగాలం శ్రమించి పంటలు పండించి అందరి ఆకలి తీర్చే రైతన్నపై ఎరువుల ధరల పిడుగు ఏటా పడుతూనే ఉంది. ఈ ఏడాది కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఆయా కంపెనీలు నాలుగు సార్లు పెంచడంతో వచ్చే వానాకాలంలో పంటల సాగు మరింత భారం కానుంది. గత వానాకాలం సీజన్లో బస్తాకు రూ.50 నుంచి రూ.300 పెరగగా.. ఈ యాసంగి సీజన్లో బస్తాకు రూ.50 చొప్పున రెండుసార్లు కలిపి రూ.100 పెంచారు. తాజాగా నాలుగోసారి బస్తాకు రూ.225 నుంచి ఽరూ.300 పెంచడంతో రానున్న వానాకాలం సీజన్లో రైతులపై ఎరువుల ధరల పెరుగుదల ప్రభావం పడనుంది. కాంప్లెక్స్ ఎరువులు జిల్లాలో సుమారుగా 1.14 లక్షల మెట్రిక్ టన్నులు వినియోగిస్తారని వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. యుద్ధం కారణంగా సహజ వాయువు సరఫరా నిలిచిపోవడం, రవాణా చార్జీలు పెరగడం తదితర కారణాలతో ధరలు పెరుగుతున్నాయని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.
రైతుల గగ్గోలు..
ప్రస్తుతం కూరగాయలు, ఇతర పంటలు సాగు చేసే రైతులు కాంప్లెక్స్ ఎరువుల కోసం వెళ్తే పెరిగిన ధరల బస్తాలు మాత్రమే విక్రయిస్తుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కంపెనీలు డీఏపీ, యూరియా మినహా అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచడంతో ఈసారి కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచినట్లు సమాచారం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్ తెలిపారు.
ఎరువు పాతఽ ధర కొత్త ధర పెంపు
19–19–19 2,075 2,300 225
20–20–13 1,500 1,800 300
14–35–14 2,175 2,250 225
12–32–15 2,025 2,250 225
పొటాష్ 1,850 1,975 125
ఎరువుల ధరలు ఇలా (రూ.లలో..)
ఏటా పెరుగుతున్న కాంప్లెక్స్ ఎరువుల ధరలు
ఈ ఏడాది నాలుగు సార్లు పెంపు
రైతన్నలపై అదనపు భారం


