అరకొరగా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు
● వేగం పెరగని మొక్కజొన్న కొనుగోళ్లు,
రోజుల తరబడి రైతుల ఎదురుచూపులు
● నాగర్కర్నూల్లో వారం రోజుల పాటు
కొనుగోళ్లు నిలిపివేత
● ప్రైవేటు అమ్మకాలతో దక్కని మద్దతు ధర
●
25 క్వింటాళ్లే కొంటారంట
నాకున్న 9 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేస్తే.. ఎకరాకు 30– 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. 20 రోజుల క్రితమే పంట కల్లాల్లో నిల్వ చేశాను. దళారులను ఆశ్రయిస్తే క్వింటా రూ.1,600లకు కొంటారంట. దేవరకద్రలో ప్రారంభించిన కొనుగోలు కేంద్రంలో అమ్ముదామంటే పారంభించారు. అక్కడ అమ్ముకుందామనుకుంటే ఎకరాకు 25 క్వింటాళ్లే కొంటామని అధికారులు చెబుతున్నారు.
– రమేష్, రైతు, పర్దీపురం గ్రామం, చిన్నచింతకుంట మండలం
ఎక్కడికక్కడే కొనుగోళ్లు చేపడుతున్నాం..
మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు లేకుండా కొ నుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 13 చోట్ల మొ క్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశాం. జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు రైతుల తాకిడి ఎక్కువగా ఉంది. రైతులు సమీప ప్రాంతంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
– తహమీనా,
జిల్లా మార్క్ఫెడ్ అధికారి, నాగర్కర్నూల్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో అరకొరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు కొనసాగకపోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో పాటు అవసరం మేరకు కేంద్రాలను ఏర్పాటుచేయలేదు. ఉన్న కొద్దిపాటి కేంద్రాలకే రైతులు పెద్దసంఖ్యలో వస్తుండటం, పంటను కొనుగోలు చేసేందుకు అధికారులు చేతులెత్తేస్తుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
పక్షం రోజులైనా కొలిక్కిరాని కొనుగోళ్లు..
ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న పంట చేతికొచ్చి సుమారు నెలరోజులు అవుతోంది. ఈసారి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 15 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కొనుగోళ్లు ఊపందుకోలేదు. నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఈ జిల్లాలో నర్వ మండలకేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్టు చెబుతున్నా ఇప్పటివరకు ఒక బస్తా కూడా కొనుగోళ్లు మొదలుపెట్టలేదు. నాగర్కర్నూల్ జిల్లాలో మొత్తం లక్ష మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 24 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో 50 వేల మెట్రిక్ టన్నులకు ఇప్పటివరకు కొన్నది 760 బస్తాల మొక్కజొన్న మాత్రమే. వనపర్తి జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నులకు గానూ కేవలం వెయ్యి మెట్రిక్టన్నులు, జోగుళాంబ గద్వాల జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటివరకు 8,500 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేశారు.
రైతుల అవస్థలు..
ప్రధానంగా మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పాటు అరకొరగా కేంద్రాలను ఏర్పాటుచేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈసారి అత్యధికంగా 1.80 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. కనీసం మండలానికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 13 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో కూడా కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభంకాలేదు. నారాయణపేట జిల్లాలో కేవలం ఒక్కటే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, జోగుళాంబ గద్వాలలో 7, వనపర్తి జిల్లాలో 4, మహబూబ్నగర్ జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటుచేశారు. దూరప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలకు పంటను తరలించేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్ల తీరు..
జిల్లా కొనుగోలు మొక్కజొన్న సాగు కొనుగోళ్ల లక్ష్యం ఇప్పటివరకు
కేంద్రాలు (ఎకరాల్లో) (మె.టన్నులు) కొనుగోళ్లు
మహబూబ్నగర్ 3 30,325 50,000 760
నాగర్కర్నూల్ 13 1,80,564 1,00,000 24,000
వనపర్తి 4 15,337 30,000 1,000
జోగుళాంబ గద్వాల 7 53,482 1,00,000 8,500
నారాయణపేట 1 1,450 3,200 0
ప్రైవేటులో తక్కువ ధరతో దోపిడీ..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందుల నేపథ్యంలో రైతులు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి పంటను అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో ఇదే అదనుగా ప్రైవేటు దళారులు తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తూ అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లకు ప్రభుత్వ మద్ధతు ధర క్వింటాలు రూ. 2,400 లభిస్తుండగా, ప్రైవేటులో ఎక్కడా క్వింటాలు రూ.1,700 దాటడం లేదు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని, ప్రతీ మండలకేంద్రంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.


