నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
● విద్యార్థులకు
ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ
● తల్లిదండ్రులతో
ఉపాధ్యాయుల సమావేశాలు
● సెలవుల్లో పాటించాల్సిన
జాగ్రత్తలపై అవగాహన
● జూన్ 12న పునఃప్రారంభం కానున్న పాఠశాలలు
నారాయణపేట రూరల్: ఉపాధ్యాయ బదిలీలు.. ప దోన్నతులు.. ఎన్నికల నిర్వహణ.. ఇలా అన్ని రకా ల అవాంతరాలను అధిగమించి విజయవంతంగా విద్యా సంవత్సరం ముగిసింది. శుక్రవారం నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానుండగా.. గురువారం ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డులను విద్యా ర్థులకు అందించారు. జూన్ 12న తిరిగి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. చివరి రోజు పాఠశాలల్లో ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటుచేసి.. విద్యార్థుల ప్రగతిని వివరించారు. అదే విధంగా ఏడాది మొత్తం నిర్వహించిన నాలుగు ఎఫ్ఏ, రెండు ఎస్ఏ పరీక్షలకు సంబంధించిన మార్కులను ఆన్లైన్లో పొందుపరిచి.. ప్రగతి నివేదికను అందజేశారు. సెలవుల్లో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులకు వివరించారు. గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల్లో ఉన్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు.
ఆన్లైన్లో విద్యార్థుల ప్రగతి..
సంగ్రహణాత్మక మూల్యాంకనం (ఎస్ఏ)–2 పరీక్షలు ఈ నెల 18న పూర్తి కావడంతో ఉపాధ్యాయులు వారం రోజులపాటు సమాధాన పత్రాల మూల్యాంకనంలో బిజీగా గడిపారు. విద్యార్థుల ప్రగతిని తెలిపే ప్రోగ్రెస్ రిపోర్టులను తయారుచేసి.. గతంలో మాదిరిగా కాకుండా విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ప్రగతి పత్రాలను అందజేశారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది జరిగిన నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1, 2, 3, 4) పరీక్షలతో పాటు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ–1, 2) పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సంబంధిత వెబ్సైట్లో పొందుపరిచారు. సమగ్ర ప్రగతి పత్రం పేరుతో ప్రోగ్రెస్ కార్డులను అధునాతన పద్ధతిలో ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేశారు.
జిల్లాలో విద్యార్థుల సంఖ్య ఇలా..
ప్రభుత్వ బడులు : 2,993
స్థానిక సంస్థలు : 41,721
గురుకులాలు : 7,868


