నారాయణపేట: విద్యార్థుల ప్రతిభకు చదువుల పండగ కార్యక్రమం ఒక వేదికగా నిలిచిందని కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో ‘చదువుల పండుగ 2.0’ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రతీక్ జైన్ సరస్వతీ మాత చిత్రపటానికి పూజలు నిర్వహించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ అమలులో పురోగతి సాధిస్తున్నాయని, నవకల్పనలు రాష్ట్ర విద్యాశాఖకు దిక్సూచిగా మారాలని ఆయన ఆకాంక్షించారు. తాను రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు విద్యా అభివృద్ధికి నారాయణపేట జిల్లాలో చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు గురించి విన్నానని, కలెక్టర్లు కోయ శ్రీహర్ష, సిక్తా పట్నాయక్ జిల్లాలో విద్యాభివృద్ధికి చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. అంతకు ముందు కలెక్టర్ చేసిన స్టాళ్లను సందర్శించి, విద్యార్థులను అభినందించారు. మండల స్థాయి పోటీల్లో విజేతలైన 3, 4, 5, 6, 7 తరగతుల విద్యార్థులు జిల్లా స్థాయిలో నిర్వహించిన తెలుగు, ఆంగ్లం, గణితం పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అదనంగా 6, 7 తరగతుల విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీల్లో కూడా విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే మొదటిసారి..
విద్యార్థులు ఎఫ్ఎల్ఎన్, సామర్థ్యాలకు అద నంగా ఎల్బీ రీడింగ్, కాంప్రహెన్షన్, రైటింగ్, మెమరీ టెక్నిక్స్, వేదిక్ మ్యాథమెటిక్స్ వంటి అంశాలపై పోటీలను నిర్వహించడం రాష్ట్రంలోనే ఇదే మొదటిసారి కావడం విశేషం. కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు తమ వి ద్యా కార్యక్రమాలను ప్రదర్శిస్తూ ప్రత్యేక స్టాళ్ల ను ఏర్పాటు చేశాయి. బోష్ సంస్థ సహకారంతో అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రదర్శించారు. స్వతః ఫౌండేషన్ వారు ఆర్థిక అవగాహ న కార్యక్రమాలు, ఇంక్వి–ల్యాబ్ సంస్థ ద్వారా విద్యార్థుల ఆవిష్కరణలను ప్రదర్శించారు. డిజిటల్ ఈక్విటీ సంస్థ డిజిటల్ లిటరసీ కార్యక్రమాలను, ఫ్యూచర్డాట్స్ సంస్థ కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను పరిచయం చేసింది. ఆలోకిట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్ ఒరేటర్స్ క్లబ్ ప్రదర్శనలో విద్యార్థులు తమ ఆంగ్ల నైపుణ్యాలను అద్భుతంగా చూపించారు.
రైజింగ్ జిల్లాగా ‘పేట’
ఎఫ్ఎల్ఎన్ పనితీరులో రాష్ట్రంలో టాప్ 5 జిల్లాల్లో పేట స్థానం సంపాదించిందని ల్లా విద్యాశాఖాధికారి డా.గోవిందరాజు తెలిపారు. అలాగే పరక్/నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో జిల్లాను రైజింగ్ జిల్లాగా గుర్తించారని వెల్లడించారు. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారులు విద్యాసాగర్, సెక్టోరియల్ అధికారులు నాగార్జున, శ్రీనివాస్, సైన్స్ అధికారి భానుప్రకాష్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.


