జిల్లాలో కొన్నేళ్లుగా
మలేరియా కేసులు
● ఈ ఏడాది ఇప్పటి వరకు
నమోదుకాని ఒక్క కేసూ
● అయినా పెరుగుతున్న
రక్తపరీక్షలు
కర్నూలు(హాస్పిటల్): జ్వరమా అయితే మలేరియా కావచ్చు..వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్తపరీక్షలు చేయించుకోండి. ఇది ఒకప్పటి ప్రభుత్వ నినాదం. మలేరియా కేసులు విస్తృతంగా ఉన్న సమ యంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని మలేరియా విభాగం సిబ్బంది రక్తపరీక్షలు అధికంగా చేశారు. కానీ ఇప్పుడు మలేరియా కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయని చెబుతున్నారు. అయితే జ్వరాల కేసులు పెరగడం, అదే స్థాయిలో అందరికీ రక్తపరీక్షలు నిర్వహించడంపై అనుమానాలు ఉన్నాయి. మలేరియా కేసులు మాత్రం బయటపడకపోవడం చర్చనీయాంశమైంది.
పెరుగుతున్న రక్తపరీక్షలు
జిల్లాలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 28 అర్బన్హెల్త్ సెంటర్లు, ఐదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, రెండు ఏరియా ఆసుపత్రులు, ఒక బోధనాసుపత్రి ఉన్నాయి. వీటన్నింటిలో మలేరియా వ్యాధినిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల రక్తపరీక్షల సంఖ్య పెరుగుతున్నా కేసులు మాత్రం నమోదు కావడం లేదు. రోగుల్లో మలేరియా లక్షణాలు కనిపిస్తున్నా కాదని సిబ్బంది తేల్చేస్తున్నారు. రోగికి వచ్చింది వైరల్ జ్వరాలని చెప్పి చికిత్స అందిస్తున్నారు. గత సంవత్సరం పది కేసులు నమోదు కాగా ఈ యేడాది ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. 2030 నాటికి మలేరియా రహిత దేశంగా మార్చాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సంవత్సరం రక్తపరీక్షలు మలేరియా
కేసులు
2018 2,36,704 18
2019 2,49,187 7
2020 1,93,586 14
2021 2,56,395 16
2022 3,16,178 6
2023 4,18,850 4
2024 4,86,151 17
2025 7,06,836 10
2026 3,18,538 0
(ఇప్పటివరకు)


