నంద్యాల: జనాభా గణనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో ఆదివారం పట్టణంలో 5కే రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం కలెక్టర్ చాంబర్లో సెన్సస్ ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే 5కే రన్ కార్యక్రమానికి సంబంధించిన టీ–షర్ట్లు ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెన్సెస్ ప్రక్రియ ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేసేందుకు ఈ కార్యక్రమం ముఖ్య వేదికగా నిలుస్తుందన్నారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు టెక్కె మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు నిర్వహించే 5కే రన్లో యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తమ బృందాలతో తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ రామునాయక్, మునిసిపల్ కమిషనర్ శేషన్న, ఆర్డీఓ విశ్వనాథ్, కలెక్టరేట్ ఏఓ శుభాకర్ పాల్గొన్నారు.
సత్రాల నిర్వాహకులు
ఇతోధిక సేవలందించాలి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులకు స్థానిక సత్రాల నిర్వాహకులు ఇతోధిక సేవలందించాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు సూచించారు. శనివారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో స్థానిక సత్రాల నిర్వాహకులతో ఈఓ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి తీవ్రత కారణంగా అన్నీ సత్రాల నిర్వాహకులు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. చలివేంద్రంలో మంచినీటితో పాటు మజ్జిగను ఉచితంగా భక్తులకు అందించాలన్నారు. పరిసరాలను శ్రుభంగా ఉంచడంతో పాటు, తాజా కూరగాయలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్షేత్రంలో ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సత్రం ప్రాంగణంలో చెత్త కుండీలను ఏర్పాటు సుకోవాలన్నారు. అవకాశం మేరకు సత్రాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు, పారాయణలు, భజనలు, సత్సంగాలు మొదలైన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ విభాగం ఏఈవో శ్రీనివాసరెడ్డి, పర్యవేక్షకులు ఎం.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.


