కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి బయట తిరిగేందుకు జనం బెంబేలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలులు వీస్తున్నాయి. శనివారం జిల్లాలోని చిప్పగిరి మండలం నగరడోన గ్రామంలో 44.8 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్జైన్ తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎండలో బయటకు వెళితే తప్పక టోపీలు ధరించాలన్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, మంచి నీరు అధికంగా తీసుకోవాలని సూచించారు.


