● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: జిల్లాలో ఎక్కడా ఇంధన కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టర్ చాంబర్లో శుక్రవారం జిల్లాలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ సరఫరా అంతరాయంపై జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 199 పెట్రోల్ బంకులు ఉన్నాయని, అవసరమైన ఇంధన నిల్వలను సమకూర్చేందుకు ఉన్నతాధికారులతో సమన్వయం కొనసాగిస్తున్నామన్నారు. ప్రస్తుతం వరి కోతలు కొనసాగుతున్న నేపథ్యంలో వ్యవసాయ యంత్రాలకు అవసరమైన డీజిల్ సరఫరా నిరంతరంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాణ్ మాట్లాడుతూ పెట్రోల్ బంకుల వద్ద ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో సివిల్ సప్లయ్ అధికారులు రవిబాబు, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్, నయారా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


