ఆళ్లగడ్డ: అహోబిలం క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం మూలమూర్తులు స్వామి అమ్మవారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించి అనంతరం పట్టు పీతాంబరాలతో అలంకరించి కొలువుంచారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి ఉభయ దేవేరులతో శేష వాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో వివహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై కొలువైన జ్వాలా నరసింహస్వామి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు.


