ఆళ్లగడ్డ: ఇంధన సెగ జిల్లాలోని వాహనదారుల ను ఇబ్బందులకు గురిచేస్తోంది. జిల్లాలో అవసరమైన మేర ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జిల్లాలోని దాదాపు అన్ని బంకుల దగ్గర గత రెండు మూడు రోజులుగా వాహనదారులు బారులుదీరి కనిపిస్తున్నారు. శుక్రవారం ఆళ్లగడ్డ – నంద్యాల రహదారి వెంబడి ఉన్న బంకుల్లో ఎక్కడా డీజిల్ దొరకలేదు. కొన్ని బంకుల్లో పెట్రోల్ మాత్రం విక్రయిస్తుండగా గంటల కొద్ది ద్విచక్ర వాహనదారులు నిల్చొని పెట్రోల్ పట్టించుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం వచ్చిన భక్తులు తన వాహనాలకు డీజిల్ లేక అనేక అగచాట్లు పడ్డారు. కొందరు అక్కడే వాహనాలు వదిలి బస్సులకు వెళ్లి పోగా మరి కొందరు బ్లాక్లో కొనుగోలు చేయాల్సి వచ్చింది. అహోబిలంలో పావన క్షేత్రానికి వాహనాలు నడిపే వాహనదారులు కొందరు బద్వేల్ వెళ్లి డీజిల్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.


