మహానంది: మహానంది పుణ్యక్షేత్రంలో వైశాఖ శుద్ధ సప్తమి సందర్భంగా గురువారం గంగా పుష్కరోత్సవం పూజలు వైభవంగా జరిగాయి. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శంకరయ్యశర్మ, ఏఈఓ ఎరమల మధు, సూపరింటెండెంట్ అంబటి శశిధర్రెడ్డి, ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య, అర్చకులు శరభయ్యశర్మ, రఽఘుశర్మ వేకువజాము నుంచే విశేష పూజలు నిర్వహించారు. ముందుగా గంగాదేవి అమ్మవారిని రాజగోపురం వద్ద కొలువు తీర్చి గణపతి పూజ, పుణ్యాహవాచనం, షోడశోపచారాలు నిర్వహించి లోపల ఉన్న రుద్రగుండం కోనేరులోకి మేళతాళాలు, భాజాభజంత్రీలతో సాదరంగా తీసుకెళ్లారు. అక్కడ పంచలింగాల మండపంలో పంచామృతాలు, వివిధ చూర్ణాలు, పసుపు, కుంకుమ, విభూతి, గంధం, చందనం, పన్నీరు, పుష్పాలతో అభిషేక పూజలు ఘనంగా చేయగా భక్తులు కనులారా తిలకించారు. గంగాదేవితో కలిసి లోక కల్యాణార్థం సంకల్ప స్నానాలు నిర్వహించారు. వేలాది సంఖ్యలో భక్తులు హాజరై పుణ్యస్నానాలు ఆచరించి కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు.


