● వైభవంగా నారసింహ జయంతి బ్రహ్మోత్సవాలు
ఆళ్లగడ్డ: నృసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉదయం హంస వాహనం, రాత్రి సూర్య ప్రభ వాహనాలను అధిరోహించి మాడ వీధుల్లో వివహరిస్తూ భక్తులను కటాక్షించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం మూలమూర్తులు స్వామి అమ్మవారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వాములను యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకం, తిరుమంజనం చేశారు. అనంతరం పట్టు పీతాంబరాలతో అలంకరించి కొలువుంచారు. నారసింహ స్వామిని విశేషంగా అలంకరించిన హంస వాహనంపై కొలువుంచి మాడవీదుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి సూర్యప్రభ వాహనం మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులను స్వామి కటాక్షించారు.


