● మహిళలను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి
కల్లూరు: ‘ఏబీఎన్ రాధాకృష్ణా.. చంద్రబాబు నాయుడికి ఊడిగం చేసుకోండి. మహిళలను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం’ అని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఏబీఎన్ రాధాకృష్ణపై కర్నూలు నాల్గో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టెలివిజన్ చానల్లో ఈ నెల 4న వీకెండ్ కామెంట్ బై ఆర్కే కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసేలా, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యనాలు చేయడం దారుణామన్నారు. జర్నలిజంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడాడం చాలా బాధాకరంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు తిరిగి మీ ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు విమర్శలు చేయడం చూశాం గాని ఒక పత్రిక, చానల్ యజమాని ఇలా మాట్లాడటం మొదటిసారి అన్నారు. మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు.
అధికారం ఎవరు ఇచ్చారు?
తనకు సంస్కృతి ఉందని, అలాగే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందని, అసభ్య పదజాలం వాడటం లేదని కాటసాని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్కు రాష్ట్ర ప్రజల్లో మంచి స్పందన వస్తుందనే ఓర్వలేక ముఖ్యమంత్రి చంద్రబాబు తన ‘పచ్చ’ మీడియా ద్వారా డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని విమర్శించారు. ‘మావిగన్’ అంశంపై మాట్లాడాలని, మహిళలు, వైఎస్సార్సీపీ నాయకులు భార్యల గురించి మాట్లాడే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. మహిళలను గౌరవించాలని, అక్కడ అభివృద్ధి జరుగుతుందని పురణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జోనల్ విభాగం అధ్యక్షులు గాజుల శ్వేతారెడ్డి, జనరల్ సెక్రటరీ అక్కిమి హనుమంతురెడ్డి, తాజా మాజీ కార్పొరేటర్లు లక్ష్మీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, నాయకులు శివశంకర్రెడ్డి, ఉలిందకొండ రమణారెడ్డి, భీమేశ్వర్రెడ్డి, బస్తిపాడు రమణారెడ్డి, సుంకన్న, సాయి, హేమలత పాల్గొన్నారు.


